ఇద్దరం కలిసి రాజ్యాన్ని ఏలుదామంటారు: బాబుపై జగన్, పాదయాత్రలో కలిసిన జ్యోతిర్మయి
విజయనగరం: ఆంధ్రప్రదేశ్లో అన్యాయమైన పాలన కొనసాగుతోందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆయన విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రైతులకు ఉచిత కరెంట్ అంటూ చెప్పి, వేరే పేర్లతో బిల్లులు ఇస్తున్నారని మండిపడ్డారు.
ఇబ్బందిపెట్టొద్దు, ఈ తల్లి సెంటిమెంట్తో చావగొట్టొద్దు!: తల్లికి చేతులు జోడించి పవన్ కళ్యాణ్!!
జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టులు పూర్తికాక రైతులు ఇబ్బందులు బాగా పడుతున్నారని చెప్పారు. కురుపాంలో వైద్య సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో ఆపరేషన్ గరుడ తదితర అంశాలపై జగన్ స్పందించారు.
ఆపరేషన్ గరుడపై విచారిస్తే అసలు విషయం
సినిమా నటుడు శివాజీ చెబుతున్న ఆపరేషన్ గరుడ పైన రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి, సుప్రీం కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని జగన్ ప్రశ్నించారు. ఆపరేషన్ గరుడపై విచారణ జరిపితే అసలు విషయం బయటకు వస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యల పైన చంద్రబాబు సుప్రీం కోర్టుకు వెళ్లరని, కానీ ఐటీ సోదాలపై కోర్టుకు వెళ్తానని చెప్పడం మాత్రం ఆశ్చర్యంగా ఉందని చెప్పారు.
ఇద్దరం కలిసి ఏలుదామని చెబుతారు
ఏపీలో పింఛన్ నుంచి మరుగుదొడంల వరకు లంచం ముట్ట చెప్పాల్సిందేనని జగన్ అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలనేది ప్రభుత్వ పెద్దల ఆలోచన అన్నారు. చంద్రబాబు డీఎంకే అధినేత స్టాలిన్ను కలిసి సాంబారు ఇడ్లీ తింటారని, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసి శాలువాలు కప్పుతారని ఎద్దేవా చేశారు. ఇద్దరం కలిసి ఈ దేశాన్ని ఏలుదామని వారితో చంద్రబాబు చెబుతుంటారని వ్యాఖ్యానించారు.
అంతరిక్షంలోని సమస్యలు కూడా పరిష్కరిస్తానని చెబుతారు
అన్యాయం, అవినీతి పాలన చేస్తున్న చంద్రబాబుకు ఏపీ సమస్యలే పట్టడం లేదని, కానీ జాతీయ సమస్యలపై పోరాడుతామని చెప్పడం విడ్డూరమని జగన్ అన్నారు. అవసరమైతే అంతరిక్ష సమస్యలను పరిష్కరిస్తానని చంద్రబాబు చెబుతారన్నారు. నాడు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే కురుపాం అభివృద్ధి చెందిందని, చంద్రబాబు పాలనలో అభివృద్ధి లేదన్నారు.
పుష్పవాణిపై ప్రశంసలు
రాష్ట్రంలో గుడుల భూములు, బడి భూములు దోస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో ఊరికి కనీసం నాలుగైదు ఇళ్లు కూడా ఇవ్వడం లేదన్నారు. ఏ దళారులను చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, రైతుల నుంచి తక్కువ రేట్లకు కొనుగోలు చేసి, హెరిటేజ్లో నాలుగైదు రెట్లకు ఎక్కువగా అమ్ముతున్నారన్నారు. సంతలో పశువులను కొన్న మాదిరిగా తమ ఎమ్మెల్యేలను కొన్నారని, కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణిని ప్రలోభపెట్టని రోజు లేదన్నారు. ఎన్ని ప్రలోభాలు వచ్చినా విలువలతో కూడిన రాజకీయాలు చేశారని పుష్పశ్రీవాణిని ప్రశంసించారు.
టీటీడీ ప్రక్షాళన కోసం జగన్ను కలిసిన జ్యోతిర్మయి
ఇదిలా ఉండగా, తిరుమల తిరుపతి దేవస్థానం పేరును ధార్మిక సేవా పరిషత్గా మార్చాలని కొండవీటి జ్యోతిర్మయి వైసీపీ అధినేతను కలిసి కోరారు. మంగళవారం ఉదయం పాదయాత్రలో ఉన్న ఆయనను కలిశారు. టీటీడీలో రాజకీయాల జోక్యం పెరిగిందని, దీనిని తగ్గించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతికి 25 కి.మీ. పరిధిలో మద్యం విక్రయాలు జరుగకుండా చూడాలని, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖుల స్థానంలో సంఘ సేవలో పేరున్న వారిని టీటీడీ బోర్డులో నియమించాలన్నారు. వీటిని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టాలన్నారు. అధికారంలోకి వస్తే తన సూచనలను అమలు చేసేందుకు కృషి చేయాలని జ్యోతిర్మయి కోరారు. అందుకు జగన్ సానుకూలంగా స్పందించారు. టీటీడీ బోర్డు ప్రక్షాళన గురించిన ఆలోచన తన మనసులో ఉన్నదన్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తిరుమలను మరింత పవిత్రంగా చేయాల్సిన అవసరం ఉందని, అప్పుడే హిందూ ధర్మం పదికాలాల పాటు ఉంటుందని, టీటీడీలో సంస్కరణలు జరిగిన రోజే అన్ని ఆలయాలు అదే దారిలో నడుస్తాయన్నారు.