వైయస్ జగన్ పార్టీలోకి 'ఎమ్మార్' కోనేరు ప్రసాద్?
హైదరాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని ప్రచారం సాగుతోంది. కోనేరు ప్రసాద్ ఎమ్మార్ కేసులో నిందితుడు. అతను రెండు మూడు రోజుల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారట. కృష్ణా జిల్లా విజయవాడ నుండి పోటీ చేయనున్నారట. రెండు మూడు రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందంటున్నారు.
ఖమ్మం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో...
ఖమ్మం జిల్లా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా విభాగం సమావేశంలో కొంత గందరగోళం ఏర్పడింది. వచ్చే నెలలో జగన్ తెలంగాణ జిల్లాల్లో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాలో ఆయన భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన సమావేశంలో పలువురు నాయకులు సమైక్యవాది అయిన జగన్ను ఎలా తీసుకు వస్తారని ప్రశ్నించారు. మిగతా వారు సర్ది చెప్పారు.
మరోవైపు, పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. చింతపూడి నియోజకవర్గ కో-ఆర్డినేటర్ డాక్టర్ రాజారావు పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపి తీర్థం పుచ్చుకోనున్నారు.
2009 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా చింతలపూడి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆయన ఆయన జగన్ వైపు వెళ్లారు. జగన్ వైఖరితో గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న రాజారావు పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు తిరిగి సొంత గూటికి చేరుతున్నారు.