జగన్కు గట్టి షాక్, కోనేరు ప్రసాద్ రాజీనామా, శాశ్వతంగా..: కారణం ఇదే!
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీలో మరో గట్టి షాక్ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడు, వైసిపి నేతగా ఉన్న కోనేరు రాజేంద్ర ప్రసాద్ బుధవారం సంచలన నిర్ణయం ప్రకటించారు.
వైసిపికి తాను రాజీనామా చేస్తున్నట్టు విజయవాడలో ఆయన బుధవారం సాయంత్రం ప్రకటించారు. అంతేకాదు శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. రాజేంద్ర ప్రసాద్ గత ఎన్నికల్లో విజయవాడ లోకసభ స్థానం నుంచి వైసిపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
అప్పటి నుంచి ఆయన క్రియాశీల రాజకీయాల్లో, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షులు జగన్కు పంపిస్తున్నానని చెప్పారు.
ఇటీవలి కాలంలో వైసిపిలో జరుగుతున్న పరిణామాలు, దీంతో పాటు ఉత్తరాంధ్రలో కోనేరు ప్రసాద్కు బీచ్ శాండ్ ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పైన ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో విశాఖకు చెందిన బిజెపి ఎమ్మల్యే విష్ణు కుమార్ రాజు దానిపై శాసన సభలో ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోనేరు రాజీనామా ప్రాధాన్యత సంతరించుకుంది.