కేసీఆర్కు 'కేబినెట్' షాక్: అలక వహించిన కొప్పుల చల్లబడ్డా...
హైదరాబాద్/కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు తొలి షాక్! కేబినెట్ విస్తరణ నేపథ్యంలో.. తనకు మంత్రిపదవి ఇవ్వకపోవడం అన్యాయమని తెరాస సీనియర్ నేత, ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు ప్రభుత్వ చీఫ్ విప్ పదవి ఇవ్వడంతో అలకపాన్పు ఎక్కారు. అయితే, తెరాస ముఖ్యనేతలు రంగంలోకి దిగి అతనిని బుజ్జగించారని తెలుస్తోంది. దీంతో అతను చల్లబడ్డారంటున్నారు.
అంతకుముందు, కేసీఆర్ తీరుపై అసంతృప్తితో ఉన్న.. తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్యాయమని తన సన్నిహితులవద్ద చెప్పుకుని వాపోయారని తెలుస్తోంది. చీఫ్విప్ పదవిని స్వీకరించేందుకు నిరాకరించారని తెలుస్తోంది. పదవి నిరాకరిస్తున్నట్లు కేసీఆర్ పీఏకు కొప్పుల ఈశ్వర్ చెప్పారని అంటున్నారు.
అయితే, కొప్పులను బుజ్జగించడంతో ఆయన బెట్టు వీడారని తెరాస వర్గాలు చెబుతున్నాయి. ఆయన తగ్గినప్పటికీ ఆయన అనుచరులు, మాల మహానాడు కార్యకర్తలు మాత్రం కేసీఆర్ పైన భగ్గుమంటున్నారు. కరీంనగర్లో నిరసనకు దిగారు. కేసీఆర్ దళితుల ఆత్మగౌరవం దెబ్బతీశారని మండిపడ్డారు.
కొప్పులకు డిప్యూటీ సీఎం ఇవ్వకుండా, కనీసం మంత్రి పదవి ఇవ్వకుండా మాలల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ దెబ్బతీశారని మండిపడ్డారు. కొప్పులకు మంత్రి పదవి ఇవ్వకుంటే తాము తెరాస భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు.
కరీంనగర్లో ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొప్పుల మెత్తబడ్డా ఆయన అనుచరులు, మాల మహానాడు మాత్రం చల్లబడటం లేదంటున్నారు. వారితో కొప్పుల మాట్లాడుతున్నారని తెలుస్తోంది. అలాగే ఆయన హైదరాబాదుకు బయలుదేరారు.
ఉప ముఖ్యమంత్రి పదవి రేసు నుండి...
ధర్మపురి ఎమ్మెల్యే అయిన కొప్పుల ఈశ్వర్ తొలుత ఉప ముఖ్యమంత్రి పదవి, తర్వాత మంత్రి పదవి రేసులో ముందు నిలిచారు. అయితే, తాజాగా ప్రభుత్వ చీఫ్ విప్ పదవి దక్కింది. మాల సామాజిక వర్గానికి చెందిన ఈశ్వర్ సౌమ్యుడు, మృదుభాషి, వివాదరహితుడు, సీనియర్ నాయకుడు, అధిష్ఠానానికి విధేయుడు.
కానీ ఆయనకు మంత్రి పదవి మాత్రం దక్కకపోవడంపై తెరాసలోనే సానుభూతి వ్యక్తమవుతోందంటున్నారు. తెరాస 2001లో ఆవిర్భవించగా మొదటిసారి సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొన్న 2004లో కరీంనగర్ జిల్లా మేడారం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
అధిష్ఠానం ఆదేశాల మేరకు 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2009 ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గానికి మారి, గెలిచారు.
2010లో మళ్లీ రాజీనామా చేసి, ఉప ఎన్నికల్లో గెలిచారు. 2014లోనూ ధర్మపురి నుంచే గెలుపొందారు. తెరాస అధికారంలోకి రావటంతో కొప్పుల ఈశ్వర్ పేరును మొదట అసెంబ్లీ స్పీకర్ పదవి కోసం పరిశీలించారు. డిప్యూటీ స్పీకర్ పదవి రేసులోనూ ఆయన పేరు వినిపించింది. ఒక దశలో ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమని ప్రచారం జరిగింది.
కానీ, చివరికి మంత్రి పదవి కూడా దక్కలేదు. ఎన్నికల ముందు పార్టీలో చేరిన రాజయ్యను ఉప ముఖ్యమంత్రిగా తీసుకొని, మొదటి నుంచి పార్టీలో కొనసాగుతున్న ఈశ్వర్కు అన్యాయం జరిగిందని ఆయన సానుభూతిపరులు వాపోయారు.
ఈ క్రమంలో కొప్పుల ఈశ్వర్ను పలు సందర్భాల్లో మంత్రి కేటీఆర్ అనునయించారు. కరీంనగర్ జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు ఈశ్వర్కు ఈసారి మంత్రి పదవి ఖాయమని కేటీఆర్ బహిరంగంగానే ప్రకటించారు. సీఎం నుంచి కూడా ఆమేరకు హామీ లభించిందని అంటున్నారు. అయితే, ఆయనకు కేబినెట్లో అవకాశం రాలేదు. ఆయన అలక వహించడంతో గులాబీ ముఖ్యనేతలు ఆయనను బుజ్జగించారు.