'చంద్రబాబు.. ఆ ఒక్క మాట చెప్పు, సీఎం అన్న గౌరవంతో.. మేము పోరాడుతాం'
సీఎంగా చంద్రబాబుపై తమకు గౌరవముందని, ఓటుకు నోటు ఆడియో టేపుల్లోని గొంతు తనది కాదని తేలితే, ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నవారి మీద పోరాటం చేస్తామని కోటంరెడ్డి అన్నారు.
అమరావతి: ఓటుకు నోటు కేసులో సుప్రీం కోర్టు నుంచి చంద్రబాబుకు నోటీసులు జారీ అయిన విషయంపై అసెంబ్లీలో చర్చ జరగాలని ప్రతిపక్షం వైసీపీ పట్టుబట్టింది. అయితే పక్క రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనపై ఏపీ అసెంబ్లీలో చర్చ లేవనెత్తడాన్ని స్పీకర్ తప్పుపట్టారు. దీంతో అధికార పక్ష తీరుపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు గనుక ఎలాంటి ప్రమేయం లేకపోతే.. 'మనవాళ్లు బ్రీఫుడు మీ' అన్న గొంతు తనది కాదని అసెంబ్లీలో ఒక్క మాట చెప్పాలని చంద్రబాబును ఆయన డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి సభలో చర్చ జరగాల్సిందేనని ఆయన అన్నారు.
కేసులో సీఎం చంద్రబాబుపై ఆరోపణలు ఉండటంతో దానిపై చర్చకు అవకాశం ఇవ్వాలని కోటం రెడ్డి పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబుపై తమకు గౌరవముందని, ఓటుకు నోటు ఆడియో టేపుల్లోని గొంతు తనది కాదని తేలితే, ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తున్నవారి మీద పోరాటం చేస్తామని అన్నారు. ఆడియో టేపుల్లోని వ్యాఖ్యలను అసెంబ్లీ సభ్యులందరికి వినిపించాలని డిమాండ్ చేశారు.