జగన్ కాళ్లపై పడిన వ్యక్తి ఇప్పుడు మంత్రి: కోటంరెడ్డి సంచలన వ్యాఖ్యలు
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ అఘోరా అని, సోషల్ మీడియాను బ్రహ్మాస్త్రంగా చేసుకొని ప్రభుత్వాన్ని మరింత నిలదీద్దామని వైసిపి నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం నాడు అన్నారు. చంద్రబాబు సాక్షి ఛానల్ గొంతు నొక్కుతున్నారన్నారు.
ఒక రోజు పులివెందులలో పర్యటిస్తుండగా టిడిపి నేత ఒకరు వచ్చి కారు ఆపి మరీ జగన్ కాళ్ల మీద పడ్డారని, అందుకు తానే సాక్ష్యమని, కాళ్ల మీద పడి తనకు ఎలాగైనా వైసిపి టికెట్ ఇవ్వాలని కోరారని, తాను వేరొకరికి మాట ఇచ్చానని, పార్టీని నమ్ముకున్నవారికే టికెట్ ఇసతానని జగన్ చెప్పారని, దాంతో ఆ నాయకుడు టిడిపిలోనే ఉండిపోయారని, ఎన్నికల్లో గెలిచి ఇప్పుడు మంత్రిగాకొనసాగుతున్నారని కోటం రెడ్డి గుర్తు చేశారు. ఆ నాయకుడి పేరు చెప్పడం భావ్యం కాదని అన్నారు.
టిడిపి జిల్లా అధ్యక్షుడు ఒకరు తమను రైలులో కలిసి మీరైనా జగన్కు చెప్పండని, టికెట్ ఇస్తే వైసిపిలోకి వచ్చేస్తానని బతిమిలాడుకున్నారని ఆయన చెప్పారు. అది వీలు కాకపోయే సరికి ఇప్పుడు ఆ నేత టిడిపిలోనే ఉండి మంత్రి అయ్యారని చెప్పారు.
కేవలం నరేంద్ర మోడీ, పవన్ కల్యాణ్, రుణమాఫీ, జగన్ నిజయితీ కారణంగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చారని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో మాత్రం జగన్ సునామీ ముందు చంద్రబాబు నిలబడలేరని అన్నారు. వైసిపి సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకోవాలని ఆయన సూచించారు.
చంద్రబాబు సాక్షి ఛానల్ గొంతు నొక్కారు కాబట్టి, మనం సోషల్ మీడియాను ఉపయోగించి చంద్రబాబు పాలనను నిలదీద్దామని సూచించారు. సోషల్ మీడియాను చంద్రబాబు కాదు కదా ఆయన తండ్రి కూడా ఏం చేయలేరన్నారు.
పార్టీలు మారే వాళ్లను రాజకీయ వ్యభిచారులు, రాజకీయ దొంగలు అంటారన్నారు. అలాంటి వాళ్లకే కండువాలు కప్పి చంద్రబాబు తీసుకుంటున్నారన్నారు. వారికి కోట్లాది రూపాయలు ఇస్తున్నారని ఆరోపించారు. తాను హజారే కొడుకునని, కేజ్రీవాల్ బావమరదిని అని చెప్పుకునే చంద్రబాబు దేనికైనా సై అంటారని, రెండింటికి మాత్రం నో చెప్తారన్నారు.
రాజధాని భూదందా పైన విచారణకు, ఏపీలో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోళ్ల పైన సిబిఐ విచారణకు నో చెబుతారన్నారు. 10 మంది ఎమ్మెల్యేలను కొన్నంత మాత్రాన 2019లో ఫలితం మారదన్నారు. 2014 ఎన్నికలకు ముందు తాము గెలుస్తామని చంద్రబాబు, టిడిపి అనుకోలేదన్నారు.
ఆ సమయంలో టిడిపి నుంచి తమ పార్టీలోకి చాలామంది వస్తామని చెప్పారని, కానీ జగన్ విలువలకు కట్టుబడి వారికి నో చెప్పారన్నారు. అప్పటికే టిక్కెట్లు ఖరారయినందున జగన్ వారిని పార్టీలోకి అనుమతించలేదని చెప్పారు.
అప్పట్లో టిక్కెట్ ఇస్తామని చెబితే చాలు.. పార్టీలోకి వస్తామని రాయబారాలు నడిపారని, బేరాలు చేశారని, కానీ అలాంటి నేతలు ఇప్పుడు చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా ఉన్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో టిడిపి తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకలేదన్నారు.
చంద్రబాబు బతిమాలి మరీ కండువాలు కప్పి టిక్కెట్లు ఇచ్చారన్నారు. ప్రధాని మోడీ పుణ్యం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుణ్యాన, తప్పుడు హామీల పుణ్యాన చంద్రబాబు గెలిచారన్నారు. జగన్కు అబద్దాలు చెప్పడం చేతకాక పోవడం వల్లే బాబు గెలిచారన్నారు.
తలకిందులుగా తపస్సు చేసినా 2019లో చంద్రబాబును, ఆయన కుమారుడు లోకేష్ను ఎవరూ కాపాడలేరన్నారు. 2019లో జగన్ అనే సునామీ రాబోతుందన్నారు. ఇద్దరు మోసగాళ్లు, ఇద్దరు నియంతలు ఈ తెలుగు రాష్ట్రాలను పాలిస్తున్నారని, వారిని అడ్డుకోవాలని తెలంగాణ సీఎం కేసీఆర్ను లాగారు.