క్యాష్లెస్ లావాదేవితో తలపట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. ఏం జరిగిందంటే?
నగదు రహిత లావాదేవిల్లో ఉన్న సమస్యల గురించి చెబుతూ.. తనకు ఎదురైన అనుభవం గురించి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇలా చెప్పుకొచ్చారు.
నెల్లూరు: దేశంలో నోట్ల రద్దు తర్వాత.. ఎప్పటికైనా నగదు రహిత లావాదేవీలపై ఆధారపడటమే మంచిదన్న అభిప్రాయానికి జనం వచ్చారు. మెల్లి మెల్లిగా నగదు రహిత లావాదేవీలకు అలవాటు పడే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
ఇదంతా బాగానే ఉన్నా.. సాంకేతికంగా తలెత్తుతున్న సమస్యలు మాత్రం సామాన్యులను గందరగోళపరిచేవిగా మారాయి. సామాన్యుల దాకా ఎందుకు? ఎమ్మెల్యేలు సైతం ఇలాంటి సమస్యలతో తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి. తాజాగా ఇలాంటి పరిస్థితే తనకూ ఎదురైందని వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
'ఈ మధ్య నా కారుకు రూ.2500 డీజిల్ కొట్టించి ఏటీఎం కార్డు ఉపయోగించి స్వైపింగ్ మెషీన్ ద్వారా డబ్బులు చెల్లించా. అయితే, నా ఖాతా నుంచి రూ.16వేలు కట్ అయినట్టుగా నా మొబైల్ కు మెసేజ్ వచ్చింది. ప్రెటోల్ బంకు సిబ్బందిని అడిగితే.. తమ ఖాతాలో రూ.2500 మాత్రమే జమ అయ్యాయని చెబుతున్నారు.'
'ఇదే సందేహాంతో ఓ ఏటీఎం సెంటర్లో ఖాతాలోని డబ్బుకు సంబంధించి బ్యాంకు బ్యాలెన్స్ సరిచూసుకుంటే.. అందులో రూ.23,100 కట్ అయినట్టు స్టేట్ మెంట్ వచ్చింది. బ్యాంకుకు వెళ్లి అడిగితే.. పొరపాటు జరిగింది 24గం.ల్లో సవరిస్తామని చెప్పారు. ఇప్పటికీ 45గం. గడిచిపోయింది. ఇంకా దానిపై స్పష్టత లేదు.' అంటూ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తనకు ఎదురైన అనుభవం గురించి చెప్పుకొచ్చారు.
ఎమ్మెల్యేగా తనకే ఇలాంటి పరిస్థితులు ఎదురైతే.. సామాన్యుల పరిస్థితేంటి? అని నిలదీశారు. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలను సవరించకుండా.. దేశాన్ని నగదు రహితం వైపు నడిపిస్తామంటున్న ప్రధాని, సీఎంల తీరును శ్రీధర్ రెడ్డి తప్పుబట్టారు. బ్యాంకింగ్ లోపాలను సవరించాలని డిమాండ్ చేశారు.