అభ్యంతరకర సందేశాలు: జగన్ పార్టీ వారిపై గీత ఫిర్యాదు
విశాఖ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మహిళా నాయకురాలు, అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీతకు ఫేస్బుక్లో అభ్యంతరకర సందేశాలు రాగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆమె విశాఖ జిల్లాలో కొందరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల పైనే ఫిర్యాదు చేశారట.
విశాఖ జిల్లాలో కొందరు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తనను అప్రతిష్ఠపాలు చేయడానికి యత్నిస్తున్నారని కొత్తపల్లి గీత ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమె విశాఖపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన కులానికి సంబంధించి కూడా తాను తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సమర్పించినట్టు ఆ పార్టీ వారు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
తన ఎస్సి కుల ధ్రువీకరణ పత్రాన్ని ఫోర్జరీ క్రింద వారు ప్రచారం చేస్తున్నారని ఆమె తీవ్రంగా ఆక్షేపించారు. ఈ మేరకు ఆమె చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసును ఈస్ట్ డిసిపికి బదిలీ చేసినట్టు సిఐ నరసింహా రావు వివరించారు. కాగా, తన ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో పెట్టి తనను అప్రతిష్ఠపాలు చేస్తున్నారని అరకు ఎంపి గీత ఇప్పటికే ఆరోపించిన విషయం తెలిసిందే.