ఎమ్మెల్యేని కాకున్నా బాబు రమ్మన్నారు: జగన్కు కొత్తపల్లి చేయి
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ మీద షాక్ తగులుతోంది. తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లా వైసిపి అధ్యక్షులు కొత్త పల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.
తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ఆయన ప్రకటించారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితుడనై తాను తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని చెప్పారు. తాను ఎమ్మెల్యే కాకపోయినా పార్టీలో చేర్చుకుంటున్నందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు అన్నారు.
గత కొంతకాలంగా కొత్తపల్లి సుబ్బారాయుడు టిడిపిలో చేరుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆయన పార్టీలోకి వచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పచ్చజెండా ఊపారు.
రాజకీయాల్లోకి కొత్తపల్లి తెలుగుదేశం పార్టీ ద్వారానే అరంగేట్రం చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు మంచి పనితీరును కనబరిచారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన టీడీపీకి గుడ్ బై చెప్పారు.