జగన్కు 'గోదావరి' షాక్: కొత్తపల్లికి చంద్రబాబు ఫోన్, గ్రీన్ సిగ్నల్
అమరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్కు మరో షాక్ తగలనుంది. పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు ఆ పార్టీకి చెందిన నేతలతో మంతనాలు జరుపుతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీలో విపక్ష పార్టీకి కొనసాగుతున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గడచిన ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. పశ్చిమ గోదావరి జిల్లాను తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అంతేకాదు చంద్రబాబు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కూడా ఉభయగోదావరి జిల్లాలే.
ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక బహిరంగ సభల్లో ప్రస్తావించారు. అంతేకాదు అభివృద్ధి, నిధుల కేటాయింపులో పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కూడా ప్రకటించారు. ఇందులో భాగంగా టీడీపీ చేపట్టిన 'ఆపరేషన్ ఆకర్ష్'లో భాగంగా ప్రస్తతం వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని టీడీపీలోకి ఆహ్వానించారని తెలుస్తోంది.
కాగా రాజకీయాల్లోకి కొత్తపల్లి తెలుగుదేశం పార్టీ ద్వారానే అరంగేట్రం చేశారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఆయన మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన కొత్తపల్లి సుబ్బారాయుడు మంచి పనితీరును కనబరిచారు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన టీడీపీకి హ్యాండిచ్చారు.
ఆ తర్వాత చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యంలో చేరారు. ఆ తర్వాత ఆ పార్టీ అంతర్థానం కావడంతో వైయస్ జగన్ స్థాపించిన వైసీపీలో చేరిపోయారు. గడచిన ఎన్నికల్లో ఓటమి పాలైన కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడి హోదాలో కొనసాగుతున్నారు.
అయితే ఇప్పుడు తన సొంత గూటికి చేరేందుకు కొత్తపల్లి చేస్తున్న యత్నాలను తెలుకున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి స్వయంగా కొత్తపల్లికి ఫోన్ చేశారు. తిరిగి టీడీపీలోకి రావాలని ఆయన కొత్తపల్లికి ఆహ్వానం పలికారు. చంద్రబాబే స్వయంగా ఫోన్ చేయడంతో టీడీపీలో చేరేందుకు ఉన్నానని చెప్పిన కొత్తపల్లి... త్వరలోనే పార్టీలో చేరతానని చెప్పారు.
తాను కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళుతున్నానని, తిరిగి వచ్చిన తర్వాత కలుద్దామని చంద్రబాబు ఆయనకు చెప్పారు. మంచి ముహూర్తం చూసుకుని పార్టీలో చేరతానని కొత్తపల్లి చెప్పినట్లుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా వైసీపీ అధినేత జగన్ తీరుపై కొత్తపల్లి అసంతృప్తితో ఉన్నారని, అందుకే ఆ పార్టీకి గుడ్ బై చెప్తున్నారని తెలిసింది.