కర్నూలుపై వివక్ష: బాబుకు కోట్ల కౌంటర్, ఏం నటన.. జగన్ను ఏకేసిన యనమల
చిత్తూరు: రాయలసీమ ప్రాంతాన్ని కరవురహిత ప్రాంతంగా చేస్తానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు అన్నారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన అన్నారు.
వ్యక్తులు శాశ్వతం కాదని, సమాజం శాశ్వతమని ఆయన వ్యాఖ్యానించారు. తమ వంశాచారం ప్రకారం తన మనవడు దేవాన్ష్కు పుట్టు వెంట్రుకలను కుల దేవత వద్ద తీయించామని చంద్రబాబు చెప్పారు.
ఆనం సోదరులకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
టిడిపిలో చేరాలనుకుంటున్న ఆనం సోదరులు... ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డిలకు చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆనం సోదరుల పార్టీలోకి రావడంపై తాను చంద్రబాబుతో మాట్లాడినట్టు ఏపీ మంత్రి నారాయణ తెలిపారు.
వారిద్దరికీ తమ పార్టీ స్వాగతం పలుకుతోందన్నారు. అందరమూ కలిసి ఎస్పీఎస్ నెల్లూరు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కాగా, బొత్స సత్యనారాయణతో సత్సంబంధాలు ఉన్న ఆనం సోదరులు తొలుత వైసిపిలోకి వెళ్లేందుకు ప్రయత్నించారని, అక్కడికి వెళ్లలేకనే టీడీపీని ఎంచుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
కర్నూలుపై చంద్రబాబు వివక్ష: కోట్ల
కర్నూలు జిల్లా పైన చంద్రబాబు వివక్ష చూపిస్తున్నారని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లాలో ప్రాజెక్టుల్లో కదలిక లేదన్నారు. చంద్రబాబు మాటలు పనిలో కనిపించడం లేదన్నారు.
జగన్ అమాయక నటనను నమ్మరు: యనమల
వైసిపి అధినేత జగన్ పైన యనమల రామకృష్ణుడు వేరుగా మండిపడ్డారు. జగన్ అమాయక మాటలు నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. జగన్ ధోరణి మార్చుకుంటే మంచిదన్నారు. శ్వేతపత్రం అంటేనే వాస్తవాలు వెల్లడించడం అన్నారు. అది కూడా తెలియదా అని ధ్వజమెత్తారు.
ప్రజలను మభ్యపెట్టి జగన్ అమాయకత్వం నటించాలని చూస్తున్నారని యనమల ఎద్దేవా చేశారు. అవినీతి డబ్బుతో పార్టీ, పత్రిక పెట్టిన జగన్... అవినీతి ఆలోచనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.