జగన్ పార్టీ నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డితో కన్నా భేటీ: బీజేపీలో చేరతారా?
అమరావతి: కర్నూల్ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కోట్ల హరిచక్రపాణి రెడ్డి బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా లద్దగిరిలో ఉంటున్న హరిచక్రపాణిరెడ్డితో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నాలక్ష్మీనారాయణ కర్నూలు పర్యటన సందర్భంగా భేటీ అయ్యారు.
బీజేపీలోకి రావలసిందిగా ఆయన్ను కన్నా ఆహ్వానించినట్టు సమాచారం. 2014 ఎన్నికల్లో పత్తికొండ నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోట్ల.. టీడీపీ అభ్యర్థి కేఈ కృష్ణమూర్తిపై స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత వైసీపీకి, ప్రత్యేక్ష రాజకీయాలకు దూరమయ్యారు.
కాగా, ఆరు నెలలక్రితమే దేవనకొండలో భారీ ఎత్తున కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన టీడీపీ చేరుతారని ప్రచారం సాగింది. తాజాగా, ఆయనతో కన్నా లక్ష్మీనారాయణ భేటీ అవ్వడంతో హరిచక్రపాణి రెడ్డి బీజేపీలో చేరతారని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.