చంద్రబాబు...నాటకాలు ఆపు:మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్
కర్నూలు:ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లోని ఐదు కోట్ల మంది ప్రజల ఆశలను సాకారం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన కోసం నిజంగా పోరాడాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని కోట్ల జయసూర్యప్రకాష్ విమర్శించారు.
ఈ నెల 3వ తేదీ నుంచి ప్రత్యేక హోదా, విభజన హమీల కోసం కాంగ్రెస్ చేపట్టిన రిలే దీక్షలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా కర్నూలులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడారు. గడచిన నాలుగేళ్లుగా నోరు మెదపని చంద్రబాబు ఇపుడు ప్రత్యేక హోదా పేరుతో సరికొత్త నాటకాలకు తెరతీయడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు.
చంద్రబాబు నాలుగేళ్లు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారో...ప్రజలు అంతా గమనిస్తున్నారని అన్నారు. నిన్నటి దాకా ప్యాకేజీ దండుకున్న చంద్రబాబు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో హోదా పేరుతో పార్లమెంటులో భజన చేస్తున్నారని కోట్ల ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ప్రాంతీయ పార్టీలతో రాదని కేవలం జాతీయ పార్టీతోనే అది సాధ్యమని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.