శైలజానాథ్ బుజ్జగింపులు: మెట్టు దిగేది లేదంటూ కోట్ల పట్టు
కర్నూలు: రాష్ట్ర పార్టీ నాయకుల బుజ్జగింపులకు లొంగడానికి మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు నాయకుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సిద్ధంగా లేరు. తనకు జరిగిన అవమానానికి పార్టీ అధిష్టానం దిగిరావాల్సిందేనని ఆయన పట్టుబడుతున్నారు. తనకు జరిగిన అవమానానికి ఎఐసిసి సభ్యులు వచ్చి వివరణ ఇస్తే తప్ప పార్టీ కార్యకర్తలు శాంతించబోరని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి ఆల్టిమేటం జారీ చేశారు.
అనంతపురం జిల్లా బండ్లపల్లిలో 2వ తేదీ రాహుల్గాంధీ సభకు హాజరైనపుడు జరిగిన అవమానంపై కోట్ల సూర్యతో చర్చించడానికి గురువారం సాయంత్రం మాజీ మంత్రి శైలజానాథ్ ఆయన స్వగ్రామం కర్నూలు జిల్లా లద్దగిరికి వచ్చారు. కోట్ల సూర్యతో కొద్దిసేపు మాట్లాడిన శైలజానాథ్ సమాచార లోపం, రాహుల్గాంధీ భద్రతా సిబ్బంది కారణంగా అలా జరిగిందని, ఇందుకు తాను విచారం వ్యక్తం చేస్తున్నానని వివరించారు.
అవమానం తనకు జరిగినా కార్యకర్తలు తమకు జరిగినట్లుగా భావిస్తున్నారని వారికి సమాధానం చెప్పాలని కోట్ల సూచించడంతో కార్యకర్తలతో శైలజానాథ్ మాట్లాడారు. రాహుల్ పర్యటన తన నియోజకవర్గంలో జరిగినా పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించినందున తాను దృష్టి సారించలేకపోయానని సమాధానంగా చెప్పారు.
కొందరి అత్యుత్సాహం కారణంగా జరిగిన పొరపాటుకు పార్టీ పెద్దలు బాధపడుతున్నారని, కోట్ల ఆగ్రహాన్ని అర్ధం చేసుకున్నారని వివరించారు. కోట్ల వేదిక పైకి ఎందుకు రాలేదో తెలుసుకుని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ కోట్ల సూర్యతో మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని, దాంతో ఆయన రాహుల్ సభలో ప్రసంగించలేక పోయారని తెలిపారు.
కోట్ల కోపాన్ని వీడి పార్టీ కోసం పనిచేయాలని అంతా కోరాలన్నారు. ఇందుకు కార్యకర్తలు సమ్మతించ లేదు. కోట్ల కుటుంబం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని అంతా చెప్పుకుంటున్నారని అలాంటిది ఒకసారి కాదు ప్రతిసారీ ఏదో ఒక రకంగా అవమానాలకు గురి చేస్తే ఎలా సహిస్తామని ప్రశ్నించారు. అధికారంలో ఉన్ననాడే కాకుండా పార్టీ ప్రతిష్ట దిగజారిన సమయంలో కూడా స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు పార్టీ నేతలు కావాలని ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.
కోట్ల సరే అంటే అన్ని పార్టీల నేతలు ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారని అయినా సూర్యప్రకాశ్రెడ్డి ససేమిరా అంటున్నారని గుర్తుచేశారు. పదవులు, డబ్బు కావాలనుకుంటే ఎప్పుడో పార్టీ మారే వారని, అలాంటి నేతను గుర్తించని కాంగ్రెస్ పార్టీ పెద్దలు క్షమాపణ చెప్తే తప్ప అంగీకరించబోమని స్పష్టం చేశారు. కోట్ల పార్టీ వీడితే ఎంత నష్టం జరుగుతుందో పార్టీ పెద్దలు ఆలోచించుకోవాలని సూచించారు. పార్టీ కోసం కోట్ల కుటుంబం మొత్తం ఎన్నో త్యాగాలు చేసిందని అలాంటి నేతను రాహుల్గాంధీ సభా వేదికపైకి రానివ్వకుండా అడ్డుకుంటారా అని నిలదీశారు.
ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తానని శైలూ అన్నారు. ఎఐసిసి నేతలు కర్నూలుకు వస్తే తప్ప కార్యకర్తల ఆగ్రహం చల్లారదని పార్టీ పెద్దలకు సూచిస్తానని అన్నారు. పార్టీ కార్యాలయానికి వేసిన తాళం తీసి పార్టీ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. పార్టీ పెద్దలు వచ్చే వరకు తాళం తీయం, పని చేయబోమని తేల్చి చెప్పడంతో ఆయన తిరిగి వెళ్లారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, డిసిసి అధ్యక్షుడు బివై రామయ్య, మైనారిటీ సెల్ చైర్మన్ అహ్మద్, పలువురు సీనియర్లు పాల్గొన్నారు.