దమ్ముంటే అరెస్ట్ చేయండి.. నాకే రూల్స్ చెప్తారా.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన కామెంట్స్
నెల్లూరులో కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి,స్థానిక ఎస్పీకి మధ్య వివాదం ముదురుతోంది. ఇటీవల ఎమ్మెల్యే చేపట్టిన నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో నిబంధనలు ఉల్లంఘించారన్న విమర్శలు ఈ వివాదానికి కేంద్రబిందువుగా మారాయి. ఎమ్మెల్యే నల్లపురెడ్డికి ఉన్నతాధికారులు నోటీసులు పంపించడంతో ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్,ఎస్పీలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
దమ్ముంటే అరెస్ట్ చేయాలని సవాల్..
కలెక్టర్, ఎస్పీలు ఏసీ గదుల్లో కూర్చుని పనిచేస్తున్నారని.. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వారికి తెలియదని నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. ఆశా వర్కర్స్, వాలంటీర్స్, పోలీసులు ,వీఆర్వోలు ,వీఆర్ఏలు ఇతరత్రా సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. దమ్ము,ధైర్యం ఉంటే తనను అరెస్ట్ చేయాలని.. తాను ఎక్కడికీ పారిపోలేదని సవాల్ విసిరారు. ఎస్పీని తాను లెక్కలోకి తీసుకోవట్లేదని.. కలెక్టర్, ఎస్పీ తమ మర్యాదను కాపాడుకుంటే మంచిదని సూచించారు.
రూల్స్ బాగా తెలుసు.. చెప్పాల్సిన అవసరం లేదు..
ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తనకు కొత్తగా రూల్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రూల్స్ తనకు బాగా తెలుసన్నారు. కలెక్టర్,ఎస్పీ దగ్గర రూల్స్ నేర్చుకోవాల్సిన పనిలేదన్నారు. తనకేమో రూల్స్ గురించి చెబుతున్నారని... మరి 50-100మందితో జెడ్పీ సమావేశం ఎలా నిర్వహించారని ప్రశ్నించారు. నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమానికి తానే అధికారులను ఆహ్వానించానని.. అలాంటప్పుడు వారికెలా నోటీసులు ఇస్తారని మండిపడ్డారు. కార్యక్రమానికి హాజరైన అధికారులపై చర్యలకు ఉపక్రమిస్తే తాను ఎంతకైనా తెగిస్తానని హెచ్చరించారు.తనపై కేసు నమోదు చేసిన విషయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని నల్లపురెడ్డి పేర్కొన్నారు. ఆయన పిలుపు మేరకే తాము పేదలను ఆదుకునేందుకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం చేపట్టామని గతంలో తెలిపారు.
వివాదానికి కారణమదే..
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెంలో కొద్దిరోజుల క్రితం నల్లపురెడ్డి నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన పలువురు అధికారులను ఆహ్వానించారు. అయితే ప్రజలు గుంపులుగా తరలిరావడంతో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు ఉల్లంఘించారని జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లపురెడ్డితో పాటు మరో ఏడుగురిపై కేసులు నమోదు చేశారు. దీంతో కేసులు ఉపసంహరించుకోవాలని నల్లపురెడ్డి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. నిత్యావసర వస్తువుల పంపిణీకి హాజరైన అధికారుల్లో ఒక్క అధికారిని సస్పెండ్ చేసినా తాను రాజకీయాల నుంచే తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ,ఎమ్మెల్యే మధ్య ముదురుతున్న ఈ వివాదం చివరకు ఎక్కడికి దారితీస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.