శ్రీశైలంలో విద్యుదుత్పత్తికి తెలంగాణకు బోర్డు అనుమతి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న శ్రీశైలం జల వివాదం పైన కృష్ణా యాజమాన్య బోర్డు శుక్రవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. నవంబరు రెండవ తేదీ వరకు విద్యుత్ ఉత్పత్తి కోసం మూడు టీఎంసీల నీటిని వాడుకునేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా యాజమాన్య బోర్డు అనుమతి ఇచ్చింది.
ఈ అంశం పైన నవంబర్ 15వ తేదీ తర్వాత మరోసారి సమీక్షించాలని నిర్ణయించింది. నవంబర్ 2 తర్వాత విద్యుత్ డిమాండ్ తగ్గుతుందని బోర్డు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. బోర్డు నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులకు బోర్డు తెలియజేసింది.
కాగా, కార్మికశాఖ నిధుల మళ్లింపు వ్యవహారంలో చెలరేగిన వివాదంపై గవర్నర్ నరసింహన్తో తెలంగాణ సీఎస్, డీజీపీలు శుక్రవారం సమావేశం అయ్యారు. కార్మికశాఖకు సంబంధించిన నిధులు ఆంధ్రప్రదేశ్కు తరలించారని కొంతమంది కార్మిక సంఘాల నేతలు స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఓ అధికారిని విచారించారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరెంటు కోసం 2న ఛత్తీస్గఢ్ కేసీఆర్
ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు నవంబర్ 2న (ఆదివారం) ఆ రాష్ట్రానికి వెళ్లనున్నారు. అదే రోజు ఆ రాష్ట్ర సీఎం రమణ్సింగ్, ఇతర అధికారులతో విద్యుత్ కొనుగోలుకు సంబంధించి చర్చలు జరుపుతారు. ఆ మరుసటి రోజైన సోమవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం మీడియాకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కేసీఆర్, తన పర్యటనలో భాగంగా ఛత్తీస్గఢ్ సర్కారుతో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ) చేసుకునే అవకాశం ఉంది. ఇరు ప్రభుత్వాల మధ్య జరిగే ఈ వ్యవహారానికి సంబంధించి జరిగే ఒప్పందంపై అక్కడి విద్యుత్ సరఫరా సంస్థ, మన దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఎస్ఆర్ఎల్డీసీ) అధికారులు సంతకాలు చేస్తారు.
ఆ తర్వాత విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్ిసీ) అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈఆర్సీ అనుమతిస్తేనే పీపీఏ అమల్లోకి వస్తుంది. ఈ ప్రకియ్ర పూర్తి కావడానికి నవంబర్ నెలాఖరు వరకు సమయం పడుతుందని అధికారుల అంచనా. ఈ మేరకు ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్ సరఫరా డిసెంబర్ నాటికి మొదలు కావచ్చు.
అయితే ప్రస్తుతం గ్రిడ్ లభ్యత 200 మెగావాట్లకే పరిమితం కావడంతో పీపీఏ అమల్లోకి వచ్చాక ఆ మేరకే విద్యుత్ సరఫరా ప్రారంభమవుతుంది. ప్రస్తుతం పవర్ గ్రిడ్ కార్పొరేషన్ మహారాష్ట్రలోని నాగ్పూర్ నుంచి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి వరకు 765 కేవీ విద్యుత్ లైన్ వేస్తోంది. అది పూర్తి కావటానికి ఏడాదిన్నర నుంచి రెండేళ్ల సమయం పట్టనుంది. ఆ తర్వాతే రాష్ట్రానికి ఛత్తీస్గఢ్ నుంచి మిగతా 800 మెగావాట్ల విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉంటుంది.