కరోనా కాటు- రోడ్లపై చెప్పులు అమ్ముకుంటున్న టీచర్- ఉపాధి హామీ ఇచ్చిన కలెక్టర్...
విజయవాడ : ప్రపంచవ్యాప్తంగా కరోనా కుబేరులను సైతం బికారులుగా మారుస్తున్న వేళ ఏపీలోని విజయవాడలో ఓ టీచర్ను రోడ్లపై చెప్పుల వ్యాపారిగా మార్చేసింది. ఉపాధి కరవై రోడ్లపై చెప్పులు అమ్ముకుంటున్న సదరు వ్యక్తిని చాలా రోజుల తర్వాత గుర్తించిన మీడియా ఈ విషయాన్ని వెలుగు లోకి తీసుకొచ్చింది. నిన్న మొన్నటి వరకూ భావి భారత పౌరులను తయారు చేసి... కరోనాతో ఉపాధి కోల్పోయిన గురువును ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. దీంతో స్పందించిన అధికారులు.. ఆయనకు ఉపాధి కల్పించేందుకు హామీ ఇవ్వడంతో కథ సుఖాంతమైంది.
Recommended Video
కరోనా దెబ్బకు టీచర్ కాస్తా...
కరోనా ప్రభావం మొదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా గుండెలు పిండేసే ఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. మానవత్వం కరవవుతున్న సంఘటనలు నిత్యకృత్యమవుతూనే ఉన్నాయి. అదే సమయంలో ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిన వారు కూడా చితికిపోయి ఉపాధి లేక ఆకలితో అలమటిస్తున్న సందర్భాలూ కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో విజయవాడలో స్ధానికంగా నివాసం ఉంటున్న వెంకటేశ్వరరావు అనే టీచర్ కూడా కరోనా కాటుకు బాధితుడిగా మారిపోయాడు. ప్రైవేటు స్కూల్లో పాఠాలు చెప్పుకునే వెంకటేశ్వరరావు అవి కాస్తా కరోనాతో మూతపడటంతో చేసేది లేక రోడ్డు పక్కన చెప్పులు అమ్ముకోవడం మొదలుపెట్టాడు. ఈ విషయం చాలా రోజుల తర్వాత కానీ ఎవరికీ తెలియలేదు.
బీఆర్టీఎస్ రోడ్డులో చెప్పులమ్ముకుంటూ..
నగరంలోని అంతగా ట్రాఫిక్ లేని బీఆర్టీఎస్ రోడ్డులో ఓ పక్కన గొడుగు కింద కూర్చుని వెంకటేశ్వరరావు చెప్పులమ్ముకుంటున్నాడు. మొదట్లో ఆయన టీచర్ అన్న విషయం ఎవరికీ తెలియదు. ఎప్పటిలాగే ఆయన రోడ్డు పక్కన చెప్పులు పరుచుకుని కూర్చోవడం, వచ్చే పోయే వారికి చెప్పులు అమ్ముకోవడం జరుగుతూనే ఉంది. కానీ ఆయన్ను కొన్ని రోజులుగా గమనిస్తున్న వారు దగ్గరకు వెళ్లి విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. ఒకప్పుడు స్కూల్లో పాఠాలు చెప్పుకునే వ్యక్తి కరోనా కారణంగా చెప్పులు అమ్ముకునే స్దితికి జారిపోవడం చూసి చలించిపోయారు. వెంటనే స్ధానికంగా ఉండే మీడియా దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. చివరికి మీడియా కథనాలతో అధికార యంత్రాంగం స్పందించింది.
ఉపాధికి కలెక్టర్ హా్మీ...
మీడియా కథనాలతో అధికారుల దృష్టికి విషయం చేరడంతో వారు స్పందించారు. సామాజిక అంశాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ఈ వ్యవహారంపై ఆరా తీశారు. విషయం తెలిసి ఆయన కూడా చలించిపోయారు. భావి భారత పౌరులకు పాఠాలు చెప్పాల్సిన టీచర్ చెప్పుల వ్యాపారిగా మారడంపై విస్మయం వ్యక్తం చేశారు. వెంటనే ఆయన వద్దకు వెళ్లి పరామర్శించారు. కరోనా కారణంగా ఇలా మారాల్సి వచ్చిందని వెంకటేశ్వరరావు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో స్పందించిన కలెక్టర్ జిల్లాలో ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగం ఇస్తామని, లేదంటే వ్యాపారమే చేసుకుంటానంటే రుణం మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. దీంతో కలెక్టర్ స్పందనతో పాటు ఆయన తీసుకున్న నిర్ణయంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.