చంద్రబాబుకే రాజకీయం నేర్పుతున్న కృష్ణా జిల్లా తమ్ముళ్లు..! బెజవాడా...మజాకా..?
Recommended Video
అమరావతి/హైదరాబాద్ : కృష్ణ జిల్లా రాజకీయాలు మహా ముదురుగా సాగుతుంటాయనే చర్చ ఎప్పటినుంచో ప్రజల్లో నానుతుంటుంది. హేమా హేమీల్లాంటి నేతలకే కృష్ణా జిల్లా రాజకీయాలు పాఠాలు నేర్పుతాయని, బెజవాడ రాజకీయాలు ఒక పట్టాన అర్థం కావనే ప్రచారంకూడా ప్రజల్లో ఉంది. రాజకీయ ఉద్దండులే బెజవాడ రాజకీయాలను చూసి బెదిరిపోయిన సందర్బాలు కూడా ఉన్నట్టు సమాచారం. ప్రస్తుత బెజవాడ రాజకీయాలు కూడా అలాగే ఎవరికి అంతుచిక్కకుండా కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ అదికారం కోల్పోయిన తర్వాత నుండీ రాజకీయాలు మరింత పరాకాష్టకు చేరుతున్నట్టు తెలుస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే టీడిపి అధినేత చంద్రబాబుకే రాజకీయాలు నేర్పించే స్థాయికి కృష్ణా జిల్లా టిడిపి నేతలు వెళ్లినట్టు ప్రచారం జరగుతోంది. దీంతో బెజవాడ రాజకీయాలా.. మాజాకా అనే చర్చ కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది.
వాడివేడిగా సాగుతున్న బెజవాడ రాజకీయాలు..! బాబును సైతం లెక్కచేయని తమ్ముళ్లు..!!
ఎంతైనా బెజవాడ రాజకీయ నాయకులు మామూలోళ్లు కాదు.. సినిమా డైలాగే అయినా.. ఇప్పుడు రాజకీయంగా అది నిజమే అనిపిస్తుంది. ఐదేళ్లుగా అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబుకు కృష్ణా రాజకీయం కనిపించలేదు. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఎవరి నిజస్వరూపం ఎలా ఉంటుందనేది స్వయంగా తమకు తామే చూపుతున్నారు. అది వ్యక్తిగతమైతే బాబుకు..అండ్ టీడీపీకు వచ్చిన ఇబ్బందులంటూ ఏదీలేదు. కానీ అది ఏకంగా పార్టీనే నట్టేట ముంచేంత వరకూ చేరిందనేంత వరకూ చేరింది. అందరూ ఓడినా తాను గెలిచానంటూ గొప్పలు పోతున్న ఎంపీ కేశినేని నాని ట్వీట్లతో వార్ షురూ చేశాడు. పార్టీ ప్రయోజనాలకు భంగం కలుగుతోంది ఇక ఆపాలని సూచిస్తున్నా అదిష్టానాన్ని లెక్కచేయడం లేదు కృష్ణ జిల్లా నేతలు.
పరాకాష్ట రాజకీయాలకు కేరాఫ్ అడ్రెస్ బెజవాడ..! పట్టపగలే చుక్కలు చూస్తున్న బాబు..!!
అయితే ఇదంతా తనపై కక్ష గట్టిన వారిపైనే అనుకుంటూ వచ్చారు. అయితే తనపట్ల అంతగా కక్షసాధింపునకు దిగిన జాబితాలో బుద్దా వెంకన్న, దేవినేని ఉమా, నెట్టెం రఘురాం, గద్దె రామ్మోహన్ ఇలా చాలామంది పేర్లే ఉన్నాయట. ఎలాగూ తనకు బిజినెస్ లేదు. కేశినేని ట్రావెల్స్ను ఏనాడో ఆపేశాడు. అది కూడా.. అధికారంలో ఉన్నపుడు రవాణాశాఖ కార్యాలయంపై చేసిన జులుం కూడా నానికి చెడ్డపేరు తెచ్చింది. బోండా ఉమాతో కలసి సెటిల్మెంట్స్ చేశాడనే ఆరోపణలున్నాయి. ఈ పాపంలో ఆయనొక్కడే కాదు.. ఇప్పుడు కేసినేనికి ఎదురు తిరుగుతున్న బుద్దా వెంకన్న చిట్టా చాలానే ఉందనే ఆరోపణలున్నాయి.
అదికారంలో ఉంటే ఒక లెక్క..! లేకపోతే ఒక లెక్క..!!
లోకేష్బాబు అనుచరుడిగా కృష్ణారాజకీయాల్లో చక్రం తిప్పాడు వెంకన్న. కాల్మనీ కేసును నీరుగార్చటంలో.. పోలీసు అధికారుల పోస్టింగ్ల వరకూ వెంకన్న అన్నీ తానై నడిపాడు. ఇంతగా ఎదిగిన ఇతడిది చాలా నేరచరిత్రే ఉంది. కొబ్బరికాయలు, సినిమా హాళ్లలో సైకిల్స్ వేలం.. ఇలా చాలా జాబితానే ఉంది. అయితే ఇవన్నీ నిన్నటి వరకూ గుట్టుగా ఉండేవి. ఇప్పుడు నాని వర్సెస్ వెంకన్న మధ్య రగిలిన వైరంతో ఒక్కోకటి వెలుగులోకి వస్తున్నాయి. ఇది వైసీపీ, బీజేపీ నేతలు మాట్లాడిఉంటే పెద్దగా పట్టించుకునేవారు కాదు ఏపీ ప్రజలు. ఒకే పార్టీలో ఉన్నవారిద్దరూ ఒకరి తప్పులు ఒకరు నడిబజార్లో పెట్టుకుంటూ పరువు తీసుకుంటున్నారు.
బాబుకు రాజకీయం నేర్పుతున్న బెజవాడ నేతలు..! కంట్రోల్ చేయలేక పోతున్న అధినేత..!!
చివరకు కుక్కలు.. నక్కలు అనుకునేంతగా దిగజారటం చూస్తుంటే.. సగటు టీడీపీ అభిమానులు సిగ్గుతో చితికిపోతున్నారట. మరి కార్యకర్తల పరిస్థితే ఇలా ఉంటే.. మరి ఇక అధినేత చంద్రబాబు పరిస్థితి ఇంకెంతగా ఉడికిపోతుందనేది ఆయనకే తెలియాలి. అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ తప్పిదాలను తాము సొమ్ము చేసుకోవాలని పెదబాబు, చిన్నబాబు ఆశపడుతున్నారు. తప్పులన్నీ వెతికి వైసీపీను ఇరుకున పెట్టాలనుకుంటున్నారు. ఇటువంటి వేళ సొంతపార్టీ నాని, వెంకన్న వంటి వీరవిధేయులు ఇద్దరూ ఇంతగా చెలరేగటంపై చంద్రన్న ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తెలుగు తమ్ముళ్లు ఆసక్తిగా చూస్తున్నారు.