క్వారంటైన్ నరకానికి భయపడి జంప్ - పెరుగుతున్న ఘటనలు- ఇద్దరు ఎన్నారైలపై కేసులు..
ఏపీలో కరోనా వ్యాప్తి ఓవైపు దారుణంగా పెరిగిపోతుండగా... మరోవైపు క్వారంటైన్లలో సదుపాయాలు ఆ మేరకు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా ప్రభుత్వం క్వారంటైన్లలో సదుపాయాల మెరుగుదల కోసం ఆదేశాలు ఇచ్చినా ఇప్పటికీ చాలా చోట్ల పరిస్ధితులు చేజారుతున్నట్లు కనిపిస్తోంది. దీంతో క్వారంటైన్లలో చేరిన రోగులు అక్కడి బాధలు తట్టుకోలేక పారిపోతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఇదే కోవలో కృష్ణాజిల్లాలో క్వారంటైన్ల నుంచి పారిపోయిన ఇద్దరు ఎన్నారై రోగులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రుల్లో, క్వారంటైన్ కేంద్రాల్లో సదుపాయాలు మెరుగుపడటం లేదు. ఉన్న వాటిని కూడా పట్టించుకోకపోవడంతో కొత్తగా కుప్పలుతెప్పలుగా చేరుతున్న రోగులకు చుక్కలు కనిపిస్తున్నాయి. క్వారంటైన్ కేంద్రాల్లో పరిస్ధితులను చూసి అక్కడికి వెళ్లేందుకు సైతం రోగులు ఇష్టపడటం లేదు. ఇళ్ల వద్దే హోం క్వారంటైన్ ఉండేందుకు అవకాశం కల్పించాలనే డిమాండ్లు కూడా పెరుగుతున్నాయి.
కానీ అన్నిచోట్లా ఇది కూడా సాధ్యపడటం లేదు. దీంతో తాజాగా అమెరికా నుంచి కృష్ణాజిల్లా మైలవరం వచ్చిన ఎన్నారైలు కొనగాని శేఖర్ అలియాస్ ఐలూరి రాజశేఖర్ రెడ్డి, లక్కిరెడ్డి విశ్వనాథరెడ్డి అదే రోజు సాయంత్రం తప్పించుకుపోయారు. గ్రామకార్యదర్శి ఫిర్యాదు మేరకు పోలీసులు వీరిపై క్వారంటైన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి గాలింపు చేపట్టారు.