సెల్ఫీ దిగుతూ అట్లాంటా వాటర్ఫాల్స్లోకి- అమెరికాలో కృష్ణాజిల్లా యువతి మృతి..
సెల్ఫీ మోజు ఏపీలోని కృష్ణాజిల్లాకు చెందిన ఓ యువతికి ప్రాణాల మీదకు తెచ్చింది. ఉద్యోగం కోసం జిల్లా నుంచి అమెరికా వెళ్లిన ఓ యువతి వాటర్ ఫాల్స్ వద్ద సెల్ఫీ తీసుకునేందుకు వెళ్లి మృత్యువాత పడింది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువతి సెల్ఫీ మోజులో ప్రాణాలు కోల్పోవడం ఆమె కుటుంబ సభ్యులను విషాదంలో ముంచెత్తింది.
కృష్ణాజిల్లా గుడ్లవల్లేరుకు చెందిన పోలవరపు కమల అనే 26 ఏళ్ల యువతి ఇంజనీరింగ్ పూర్తి చేసి అమెరికాలో వెళ్లింది. అక్కడ ఎంఎస్ పూర్తి చేసుకుని కొలంబియాలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తోంది. శనివారం అట్లాంటాలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తూ అక్కడే ఉన్న జలపాతం వద్ద ఆగింది. జలపాతం అందాలు తిలకించాక సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో కాలు జారి అందులో పడిపోయింది. తనతో పాటు వెళ్ళిన వారికి కూడా కాపాడే అవకాశం లేకపోవడంతో స్ధానిక పోలీసులకు సమాచారం అందించారు.
Recommended Video
వెంటనే రంగలోకి దిగిన పోలీసులు ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. అమెరికాలోని నాట్స్ సంస్ధ సహకారంతో ఆమె మృతదేహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విషయం తెలియగానే కృష్ణాజిల్లాలోని ఆమె స్వగ్రామం గుడ్లవల్లేరులో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ కుమార్తె ఇలా హఠాన్మరణం చెందడంత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.