కృష్ణాలో వైసీపీ అరాచకం- లోన్లు ఇవ్వలేదని- బ్యాంకుల ముందు చెత్త డంపింగ్
కృష్ణాజిల్లాలో అధికారపార్టీ నేతల ఆగడాలు శృతిమించాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పథకాల రుణాలను ప్రజలకు ఇవ్వలేదని కారణంతో బ్యాంకులపై వైసీపీ నేతలు ప్రతాపం చూపారు. ఏకంగా డంపిగ్ యార్డుల్లో పారబోయాల్సిన చెత్తను బ్యాంకు బ్రాంచ్ల ముందు వేయించారు. ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ కూడా స్పందించారు. బ్యాంకులు ఉదారంగా వ్యవహరించకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన చెప్పడం విశేషం.
రుణాల మంజూరుపై వైసీపీ వర్సెస్ బ్యాంకులు
ఏపీలో వివిధ ప్రభుత్వ పథకాల కింద ప్రజలకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తోంది. అయితే క్షేత్రస్దాయిలో పేరుకుపోతున్న రుణాల బకాయిలతో బ్యాంకులు నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నాయి. ఇది స్ధానికంగా వైసీపీ నేతలకూ బ్యాంకులకూ మధ్య అగాధాన్ని పెంచుతోంది. ఇదే క్రమంలో కృష్ణాజిల్లా ఉయ్యూరులోనూ బ్యాంకులు రుణాలు మంజూరు చేయడం లేదనే ఫిర్యాదులు పెరిగాయి. బ్యాంకులు లోన్లు ఇవ్వకపోవడంతో వైసీపీ నేతలకు మంటపుడుతోంది. మరోవైపు అధికార పార్టీ నేతలపై రుణాల కోసం ఒత్తిడి పెరుగుతోంది.
బ్యాంకుల ముందు చెత్తపోసి నిరసన
కృష్ణాజిల్లాలో ఉయ్యూరులో ప్రభుత్వం వివిధ పథకాల కింద మంజూరు చేసిన రుణాలు ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్దపడకపోవడంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్ధాయిలో లబ్ది దారుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నా ఏమీ చేయలేని పరిస్ధితి. దీంతో బ్యాంకర్లపై ఆగ్రహాన్ని ఎలా చూపాలో వారికి తెలియలేదు. స్ధానిక మున్సిపల్ సిబ్బంది సాయంతో ఊరు బయట వేయాల్సిన చెత్తను బ్యాంకు బ్రాంచ్ల ముందు పారేశారు. వైసీపీ నేతల ఒత్తిడితో స్ధానిక మున్సిపల్ కమిషనర్ బ్యాంకుల ముందు చెత్త డంపింగ్ చేయించినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం బ్యాంకులకు జనం, సిబ్బంది వెళ్లే సరికి చెత్త పోసి ఉండటంతో వారంతా అవాక్కయ్యారు.
చెత్త ఘటనపై విమర్శల వెల్లువ...
ఉయ్యూరులో ప్రభుత్వ పథకాల కింద లోన్లు ఇవ్వకపోవడంతో బ్యాంకు బ్రాంచ్ల ముందు వైసీపీ నేతలు చెత్త డంపింగ్ చేయించడంపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లోన్లు ఇవ్వకపోతే చెత్త వేయిస్తారా, చెత్త వేయిస్తే బ్యాంకులు లోన్లు ఇస్తాయా అంటూ జనం ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ సిబ్బంది కూడా వైసీపీ నేతల ఒత్తిడితో బ్యాంకుల ముందు చెత్త వేయడమేంటనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. అటు బ్యాంకు అధికారులు కూడా వైసీపీ నేతల చర్యలపై మండిపడుతున్నారు. రుణాలు నిబంధనల ప్రకారమే మంజూరు చేస్తామని, ఇలాంటి చెత్త పనులు చేస్తే రుణాలు ఇచ్చే సమస్యే లేదని వారు చెప్తున్నారు.
చెత్త డంపింగ్పై కలెక్టర్ స్పందన...
ప్రభుత్వ పథకాలకు రుణాలు ఇవ్వడం లేదనే కారణంతో ఉయ్యూరులో వైసీపీ నేతలు బ్యాంకు బ్రాంచ్ల ముందు చెత్త వేయించిన ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తం కావడంతో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ స్పందించారు. బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఆయన తెలిపారు. బ్యాంకులు కూడా ప్రభుత్వ పథకాల విషయంలో కాస్త ఉదారంగా వ్యవహరించాలని కలెక్టర్ కోరారు. చెత్త వేయించిన ఘటనకు సంబంధించి మున్సిపల్ అధికారులతో మాట్లాడుతున్నామని, సీసీ కెమెరా ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నట్లు కలెక్టర్ ఇంతియాజ్ చెప్పారు.