చంద్రబాబు నివాసంలోకి వరదనీరు: వాక్ వే..రివర్ వ్యూ భవనాల మునక: హైదరాబాద్ లోనే బాబు..!!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కరకట్ట నివాసం లోపలకు నీరు చేరింది. రెండు రోజుల క్రితం వరద నీరు నివాసంలోకి వస్తుంటే అప్రమత్తమై..ముందస్తు చర్యలు తీసుకున్నారు. అయితే. చంద్రబాబు నివాసానికి ఎటువంటి ఇబ్బంది లేదని అధికారులు చెప్పిన..48 గంటల్లోనే తిరిగి వరద నీరు పోటెత్తింది. దీంతో..చంద్రబాబు నివాసంలోని వాక్ వే పూర్తిగా మునిగిపోయింది. అదే సమయంలో రివర్ వ్యూ భవనం సగానికి పైనా నీరు చేరింది. దీంతో..సిబ్బంది అక్కడ స్టోన్ క్రషర్ డస్ట్..ఇసుకతో అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నివాసంలో ప్రస్తుతం ఆయనతో సహా కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. పనివారు మాత్రం వరద నీరు లోపలకు రాకుండా అడ్డుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు తాడేపల్లి రావాల్సిన చంద్రబాబు హైదరాబాద్ లోనే ఉండాలని నిర్ణయించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఇప్పటికే చంద్రబాబు నివాసం వద్దకు చేరుకొని అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
చంద్రబాబు నివాసంలోకి వరద నీరు..
ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. దీంతో అన్ని గేట్లు ఎత్తివేసిన అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసారు. ప్రకాశం బ్యారేజి నుండి నీరు విడుదల చేయటంతో విజయవాడ నగరం తో పాటుగా రాజధాని ప్రాంతంలోని కరకట్ట దిగువ నదీ భగర్భంలో నది వేగంగా ప్రవహిస్తోంది. దీంతో..కరకట్ట వద్ద మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న నివాసంలోకి వరద నీరు చేరింది. రెండు రోజుల క్రితం చంద్రబాబు ఉంటున్న నివాసానికి వరద ముంపు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అదే రోజు వరద నీరు చంద్రబాబు నివాసంలోకి రాకుండా అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు చేసారు. దీని పైన రాజకీయంగానూ విమర్శలు వెలు వెత్తాయి. కానీ, అధికారికంగా చంద్రబాబు..లోకేశ్ మాత్రం తమ నివాసం లోకి వరద నీరు చేరిక పైన ఎక్కడా స్పందించలేదు. చంద్రబాబు ఇంటిని సందర్శించిన అధికార యంత్రాంగం మాత్రం ప్రస్తుత వరదతో చంద్రబాబు నివాసానికి ప్రమాదం లేదని తేల్చారు. దీంతో..టీడీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, 48 గంటల్లో పరిస్థితి మారిపోయింది. ఎగువ నుండి వస్తున్న వరద కారణంగా ప్రకాశం బ్యారేజీ నుండి దాదాపు ఏడున్నార లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేసారు. దీంతో..కరకట్ట వద్ద నీటి ప్రవాహం పెరిగింది. మరో సారి చంద్రబాబు నివాసంలోకి వరద నీరు చేరింది. వెంటనే సిబ్బంది అక్కడ అప్రమత్తం అయ్యారు.
నీట మునిగిన వాక్ వే..రివర్ వ్యూ భవనం..
వరద కారణంగా చంద్రబాబు నివాసం లోపలకు నీరు చేరింది. అధికారిక సమాచారం మేరకు ఇప్పటికే చంద్రబాబు నివాసంలోని వాక్ వే పూర్తిగా నీటితో మునిగింది. అదే విధంగా రివర్ వ్యూ భవనం సగానికి పైగా వరద నీటిలో ఉంది. చంద్రబాబు కుటుంబ సభ్యుల సూచనల మేరకు కొందరు స్టోన్ క్రషర్ డస్ట్..ఇసుకతో అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో పాటుగా లోకేశ్ కు చెందిన కాన్వాయ్ ను మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్ కు తరలించారు. ఇంటిలోని కింది అంతస్థులో ఉన్న సామాన్లను తొలి అంతస్థుకు మార్చారు. చంద్రబాబు నివాసంలోపల వరద నీరు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయినా..అక్కడకు ఎవరినీ అనుమతించటం లేదు. కరకట్ట వద్ద అక్రమంగా ఉన్న నిర్మాణాల్లో వరద నీరు చేరే అవకాశం ఉందని..అందరూ ఖాళీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ నుండి రాజకీయంగా విమర్శలు పెరుగుతున్నాయి. చంద్రబాబు నివాసం వద్దకు నీరు చేరేలా వైసీపీ నేతలు నీటిని విడుదల చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే, ఎగువ ప్రాంతాల నుండి వస్తున్న వరద కారణంగా నీటిని విడుదల చేస్తున్నారని..ఇందులో ఎవరికీ ఎటువంటి ఉద్దేశాలు ఆపాదించటం సరి కాదన్నది వైసీపీ నేతల వాదన. ఇప్పటికే విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల తో పాటుగా.. నదీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు.
చంద్రబాబు అమరావతి రాక వాయిదా..!!
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు అమరావతి రావాల్సి ఉన్నా..వాయిదా వేసుకున్నట్లు సమాచారం. చేతికి గాయం కారణంగా రెండు రోజులుగా ఆయన హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా, ఈ రోజు అమరావతికి రావాల్సి ఉంది. తాను ఉండే నివాసం వద్ద వరద పరిస్థితిని తెలుసుకొనే ఆయన తన రాక వాయిదా వేసుకున్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు. అనేక విషయాల మీద స్పందిస్తున్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు..మాజీ మంత్రి లోకేశ్ మాత్రం వరద వ్యవహారం పైన స్పందించలేదు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కరకట్ట వద్ద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అధికారులు సైతం అక్రమ నిర్మాణ దారులు ఖాళీ చేయాలని సూచిస్తున్నారు. చంద్రబాబు నివాసం వద్ద వరద నీటి ప్రవాహం పైన అధికారులు సైతం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. వదర మరింతగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో..సాయంత్రానికి వరద పెరిగితే కరకట్టతో పాటుగా విజయవాడ నగరంలోనూ నీరు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి జగన్ నివాసం సమీపంలోనూ తాడేపల్లి రైలు గేటు సైతం వరద నీటిలో చిక్కుకుంది. అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి అధికారులు వరద పరిస్థితి పైన ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నారు.