వరుసగా రెండో ఏడాదీ జగన్ కు తీపి కబురు- వరుణుడి కరుణ- మరోసారి ప్రాజెక్టులకు జలకళ...
రైతు సుభిక్షంగా ఉంటే రాజ్యం సుభిక్షంగా ఉన్నట్లే అనేది సామెత. గతంలో ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైంది కూడా. ముఖ్యంగా కరువు ప్రభావిత రాష్ట్రాలకు రైతు కష్టాలు బాగా తెలుస్తాయి. వర్షాకాలం ఎప్పుడొస్తుంది, వానలు ఎప్పుడు కురుస్తాయని ఎదురుచూసే రైతన్నలే ప్రతీ చోటా కనిపిస్తారు. అలాంటిది ప్రతీ ఏటా వర్షాలు సకాలంలో కరుస్తుంటే ఇక రైతులే కాదు ప్రభుత్వాలు కూడా సంతోషంగానే ఉంటాయి. సరిగ్గా ఇలాంటి పరిస్ధితి ఇప్పుడు ఏపీలో కనిపిస్తోంది. గతంలో చంద్రబాబు హయాంలో కరువు పరిస్ధితులతో అల్లాడిన రాష్ట్రానికి గతేడాది కురిసిన వానలు భారీ ఊరటనిచ్చాయి. ఈసారి కూడా అదే పరిస్ధితి కనిపిస్తుండటంతో ప్రభుత్వ వర్గాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.
జగన్ సర్కార్ విదేశీ అప్పుపై దుమారం- వ్యతిరేకిస్తున్న ఆర్బీఐ.. కేంద్రం కరుణిస్తుందా ?
కరువు పరిస్ధితులు దాటి...
గతేడాది భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వానికి నెల రోజుల్లోనే భారీ వర్షాలు పలకరించాయి. గోదావరి నది పరిస్ధితి కాస్త మెరుగ్గా ఉండటం సహజమే అయినా చాలా కాలం తర్వాత కృష్ణానదికి భారీగా వరదలొచ్చాయి. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన వరద ప్రవాహాలతో నదుల నుంచి ఇసుక తీయడం కూడా కష్టమైపోయింది. అయితే రైతు కళ్లలో మాత్రం ఆనందం వెల్లివిరిసింది. ప్రభుత్వం నుంచి వివిధ పథకాల రూపంలో తోడ్పాటు కూడా లభించడంతో వ్యవసాయ రంగం పరుగులు పెట్టింది. సరిగ్గా ఏడాది తర్వాత మరోసారి అలాంటి పరిస్ధితులే ఇప్పుడు కనిపిస్తున్నాయి.
కృష్ణా, గోదావరికి జలకళ...
ఎగువ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి నదుల్లో జలకళ కనిపిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి మొదలవుతున్న ఈ నదులపై ఉన్న ప్రాజెక్టులన్నీ వరుసగా నిండిపోతుండటంతో త్వరలోనే దిగువకు పూర్తి స్ధాయిలో నీటిని విడుదల చేసేందుకు ఆయా ప్రభుత్వాలు సిద్దమవుతున్నాయి. కృష్ణానదిపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్ర, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు భారీగా పెరుగుతున్నాయి. వీటిలో చాలా వరకూ ఎఫ్టీఎల్ స్ధాయికి చేరుతుండటంతో రేపు, ఎల్లుండిలో దిగువకు నీటి విడుదల చేయక తప్పని పరిస్ధితి. అలాగే గోదావరిలోనూ జైస్వాడి, సింగూర్, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, మానేరు, కడెం ప్రాజెక్టుల వరకూ ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ఇప్పటికే పలు ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తున్నారు.
Recommended Video
జగన్ సర్కారు సంతోషం...
గతేడాది అధికారంలోకి రాగానే కరుణించిన వరుణుడు.. వరుసగా రెండో ఏడాది కూడా ఆదుకోవడంతో జగన్ సర్కారులో సంతోషం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా కృష్ణానదికి చాలా కాలం తర్వాత గతేడాది భారీగా నీరు రావడంతో రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాజెక్టులూ నిండిపోయాయి. మరోసారి అలాంటి పరిస్ధితే ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందుకోసం నీటి మట్టాల నిర్వహణలో జాగ్రత్తలు పాటించాలని అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. గతేడాది అంచనాలకు మించి వచ్చిన కృష్ణానది వరదలకు విజయవాడ ప్రకాశం బ్యారేజీ సమీపంలో భారీగా నీరు చేరింది. దీంతో ఓ దశలో కరకట్టపై ఉన్న విపక్ష నేత చంద్రబాబు నివాసం కూడా మునిగే పరిస్ధితి వచ్చింది. దీంతో ఆయన హైదరాబాద్ కు మకాం మార్చేశారు. ఈసారి నీటి మట్టాల నిర్వహణలో అలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం సూచనలు జారీ చేస్తోంది.