బోయపాటి డైరెక్షన్లో ముగింపు వేడుకలు: కడియం నుంచి పూలు, ఆస్ట్రేలియా నుంచి టపాసులు
అమరావతి: కృష్ణా పుష్కరాలు చివరిదశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. విజయవాడకు సమీపంలోని ఇబ్రహీం పట్నం వద్ద ఉన్న పవిత్రసంగమం ఘాట్ వద్ద కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకలు జరగనున్నాయి.
కృష్ణా పుష్కరాల ముగింపు వేడుకలు ప్రముఖ సినీ దర్శకుడు బోయపాటి శ్రీను ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. పవిత్ర సంగమం ఘాట్లో మహా హారతికి భారీ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక ఆకర్షణగా స్పెషల్ ఎఫెక్ట్స్, లేజర్ షో ప్రదర్శించనున్నారు. హారతి వేదిక వెనుకభాగంలో బాణసంచా పేలుళ్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
50 పడవలు, 5 ఫంట్లుపై బాణసంచా పేలుళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుష్కరాల ముగింపు వేడుకల కోసం కడియం నుంచి పూలు, ఆస్ట్రేలియా నుంచి పెద్ద ఎత్తున టపాసులను తెప్పించారు. 12 రోజుల పుష్కరాలను నిర్విఘ్నంగా జరిపిన ఏపీ ప్రభుత్వం ముగింపు వేడుకలను కూడా అట్టహాసంగా నిర్వహించనుంది.
ఈ పుష్కర హారతి తిలకించేందుకు భక్తులు ఇప్పటికే భారీగా సంగమం ఘాట్ వద్దకు తరలివస్తున్నారు. ఈ ముగింపు వేడుక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్య, సురేష్ ప్రభుతోపాటు సింధు, గోపిచంద్ కూడా పాల్గొంటారు. మరోవైపు రెండు రాష్ట్రాల్లో పుణ్య స్నానాలకు భక్తులు పోటెత్తారు.
చివరి రోజు కావడంతో బస్టాండ్, రైల్వే స్టేషన్ కు అతి సమీపంలో ఉన్న పద్మావతి ఘాట్కు పెద్ద ఎత్తున భక్తులు పుణ్య స్నానమాచరిస్తున్నారు. సంగమం ఘాట్లో ఏర్పాటు చేసిన మహాహారతి వేదికపై 1000కి మందికి పైగా అతిథులు కూర్చునేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లను చేసింది. ముగింపు వేడుకల్లో కూచిపూడి నృత్యం ప్రదర్శించనున్నారు.
5 గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా భారీగా ఏర్పాట్లు చేశారు. పవిత్ర సంగమం ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపైనే రియో ఒలింపిక్స్ రజక పతక విజేత సింధు, ఆమె కోచ్ గోపిచంద్లను సత్కరించనున్నారు.
ఈ వేదికపైనే సింధుతో పాటు గోపీచంద్ను సత్కరించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ. 3 కోట్ల చెక్ను అందజేయనున్నారు. ఇదిలా ఉంటే కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, సురేష్ప్రభు విజయవాడలోని పున్నమి ఘాట్లో మంగళవారం పుష్కర స్నానం చేశారు.
Having Pushkara Snanam along with Railway Minister @sureshpprabhu in river krishna #KrishnaPushkaralu pic.twitter.com/6FBgcu0ZI8
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 23, 2016
ఈ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ పుష్కర ఏర్పాట్లు బాగున్నాయని కొనియాడారు. వర్షాలు పడి ప్రాజెక్టులు నిండాలని కోరుకున్నానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Taking Pushkara Snanam in Krishna Pushkaralu which comes once in every 12 years@KrishnaPushkar1 #KrishnaPushkaralu pic.twitter.com/2dKyIgheec
— M Venkaiah Naidu (@MVenkaiahNaidu) August 23, 2016