కృష్ణా పుష్కరాలు: పురోహితులకు హైదరాబాద్ 'నిఫ్ట్' డిజైనర్ దుస్తులు
విజయవాడ: ఆగస్టు 12వ తేదీ నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కరాలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గోదావరి పుష్కరాలలో ఎదురైన పరాభవం నేపథ్యంలో ఈ పుష్కరాలను అద్భుతంగా నిర్వహించాలని భావిస్తోంది.
పద్ధతి లేకుండా: బాబు ప్రభుత్వంపై సుప్రీంకు జయలలిత, మా కష్టాలివీ..
ఇందుకోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. పుష్కర పనుల పైన కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు, కృష్ణా నదికి హారతి ఇచ్చే సమయంలో సంబంధిత పురోహితులు సంప్రదాయ దుస్తుల్లో దర్శనం ఇస్తారు.
ఈ విషయమై నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్)ని రాష్ట్ర దేవాదాయ శాఖ డిపార్టుమెంట్ సంప్రదించినందని తెలుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి, అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో తయారైన సాంప్రదాయక దుస్తులతో ఆకర్షణీయమైన రీతిలో వీరు పురోహితులకు దుస్తులు రూపొందించనున్నారు.
ధోతీ, అంగవస్త్రంతో కూడిన నాలుగు రకాల దుస్తులను నిఫ్ట్ హైదరాబాద్ విభాగం డిజైన్ చేసినట్లు ఫ్యాషన్ డిజైన్ వింగ్ ప్రొఫెసర్ మాలిని పేర్కొన్నారు. ఎరుపు, పసుపు, గ్రీన్, ఆరెంజ్ వంటి ముదురు రంగుల దుస్తులను 'కృష్ణా హారతి' ఇచ్చే పురోహితుల కోసం రూపొందిస్తున్నట్లు చెప్పారు.
పార్టీ మారితే అవినీతిపరులా: జగన్-సాక్షికి వైసిపి ఎమ్మెల్యే సూటి ప్రశ్న
కాగా, ఇటీవల జరిగిన గోదావరి పుష్కరాల్లో హారతి కార్యక్రమం నిమిత్తం పూజారులు ధరించిన దుస్తులపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ నేపథ్యంలోనే కృష్ణా పుష్కరాల్లో నదీమ తల్లికి హారతివ్వనున్న పూజారులకు ఈ కొత్త దుస్తులు రూపొందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
కృష్ణా పుష్కరాల్లో నదీ హారతి కోసం తొమ్మిది మంది పురోహితులను ఎంపిక చేశారు. ఓం కార, నాగ, చంద్ర, నంది, నక్షత లాంటి తొమ్మిది రకాల హారతులను పుష్కరాల సమయంలో నదీమ తల్లికి ఇవ్వనున్నారు. పుష్కరాలు జరిగే రోజుల్లో ప్రతిరోజూ రాత్రి 7.30 గంటలకు నదీ హారతి ప్రారంభించి, పదిహేను నిమిషాల్లో ముగిస్తారు.