సంచలనం రేపుతోన్న టైమ్స్ కథనం.. : 'కృష్ణా పుష్కరాల్లొ టీడీపీ భారీ అవినీతి'
న్యూఢిల్లీ : ఏపీ ప్రభుత్వ పాలనలో చోటు చేసుకుంటున్న అవినీతి గురించి ప్రముఖ జాతీయ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ ఆసక్తికర కథనాన్ని వెలువరించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కృష్ణా పుష్కరాలకు సంబంధించిన పనుల్లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపుతున్నారనేది ఆ కథనం సారాంశం.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. ఇప్పటికే కృష్ణ పుష్కరాల పనులు పట్టాలెక్కాల్సి ఉండగా, తమ ఆర్థిక ప్రయోజనాల కోసమే టీడీపీ నేతలు పుష్కర పనులను వాయిదా వేస్తూ వస్తున్నారని పేర్కొంది పత్రిక. అంతేకాదు సమయం తక్కువుందన్న కారణంతో టెండర్ల ప్రక్రియను పక్కనబెట్టి నామినేషన్ విధానంలో తమకు అనుకూలురైన వారికే కాంట్రాక్టులను కట్టబెట్టడానికి నేతలు ప్రయత్నిస్తున్నట్టుగా పత్రిక ఆరోపించింది.
నిజానికి ప్రాజెక్టు వ్యయం రూ.5 లక్షలు మించని పనులకైతేనే నామినేషన్ విధానంలో కాంట్రాక్టులను కేటాయించే అవకాశం ఉంది. అంతకుమించిన వ్యయంతో కూడిన పనులకు ఖచ్చితంగా టెండర్ల ప్రక్రియ ద్వారానే కాంట్రాక్టులు ఖరారు చేయాల్సి ఉంది.
అయితే కావాలనే పుష్కర పనుల విషయంలో జాప్యం చేస్తూ వస్తోన్న టీడీపీ నేతలు, పనులు ఆలస్యంగా ప్రారంభమైతే టెండర్ల ప్రక్రియ ద్వారా కాంట్రాక్టులను కట్టబెట్టడానికి మరింత సమయం పడుతుంది కాబట్టి, అలా కాకుండా నేరుగా నామినేషన్ విధానంలో తమకు కమిషన్లు ముట్టజెప్పే వారికే కాంట్రాక్టులు కట్టబెట్టడానికి టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది.
ఇదే తరహాలో ఆర్ అండ్ బీ డిపార్ట్ మెంటుకు చెందిన ఓ ఇంజనీర్ బావమరిదికి కోట్లాది రూపాయల విలువ చేసే విద్యుత్ కాంట్రాక్టు పనులను అధికారులు ఎలాంటి సమీక్ష లేకుండా పెట్టారనే ఆరోపణ కూడా చేసింది.
మొత్తం ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కలిసి ఈ అక్రమాలకు తెరలేపారని పత్రిక చెబుతోంది. ఇదిలా ఉంటే, ఓవైపు ఆర్థికంగా కష్టాలున్నాయని చెప్పుకునే ప్రభుత్వం కృష్ణా పుష్కరాల కోసం రూ.1080 కోట్లు ఖర్చు చేయనున్నట్టుగా ప్రకటించినా.. ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలిపింది టైమ్స్ ఆఫ్ ఇండియా.