కృష్ణా ప్రాజెక్టులపై తాడోపేడో-త్వరలో రివర్ బోర్డు భేటీ- అజెండా ఇవ్వాలని ఏపీ, తెలంగాణకు లేఖ
కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఏపీ, తెలంగాణ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించేందుకు నదీ యాజమాన్య బోర్డు త్వరలో కీలక భేటీ నిర్వహించనుంది. ఇందులో ఇరు రాష్ట్రాలు లేవనెత్తుతున్న అభ్యంతరాలపై చర్చించి ఓ పరిష్కారం కనుగొనాలని బోర్డుకు కేంద్రం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలో భేటీ నిర్వహించబోతున్నట్లు ఇరు రాష్ట్రాల జల వనరులశాఖల అధికారులకు సమాచారం ఇచ్చారు.
మళ్ళీ కృష్ణానది కరకట్టపై కూల్చివేతలు .. ఈసారి శివ క్షేత్ర నిర్మాణాల తొలగింపు
రివర్ బోర్డ్ కీలక భేటీ..
కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచేందుకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 203 ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య కాకరేపుతోంది. వివాదాస్పద జీవోను ఉపసంహరించుకోవాలని తెలంగాణ సర్కార్ చేసిన డిమాండ్ ను పట్టించుకోని ఏపీ ప్రభుత్వం కౌంటర్ గా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఆపాలని సూచించింది. దీంతో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం మరింత ముదిరింది. తెలంగాణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మంచడం వల్లే తాము రాయలసీమ ప్రయోజనాలు కాపాడేందుకు పోతిరెడ్డిపాడు సామర్ద్యాన్ని పెంచాల్సి వస్తోందని ఏపీ వాదిస్తోంది. దీంతో ఈ వ్యవహారం తేల్చేందుకు రివర్ బోర్డు త్వరలో కీలక భేటీ నిర్వహించబోతోంది.
రివర్ బోర్డు అజెండా ఇదే...
ఈ భేటీలో చర్చించాల్సిన అంశాల అజెండాను ఇప్పటికే కృష్ణానదీ యాజమాన్య బోర్డు ఇరు రాష్ట్రాలకు పంపింది. దీని ప్రకారం కృష్ణానదిపై ఏపీ, తెలంగాణ ప్రాజెక్టుల డీపీఆర్ లు ప్రధానంగా చర్చకు రానున్నాయి. డీపీఆర్ ఉల్లంఘనలపైనే ఎక్కువగా చర్చ సాగుతున్న నేపథ్యంలో ముందుగా వీటి వ్యవహారం తేల్చాలని రివర్ బోర్డు భావిస్తోంది. అనంతరం డ్యామ్లు, రిజర్వాయర్ల వద్ద టెలిమెట్రీ అమలు తీరుపై బోర్డు చర్చించబోతోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద టెలిమెట్రీ ఏర్పాటు చేయాలని తెలంగాణ గట్టిగా కోరుతున్నా ఏపీ దాన్ని అమలు చేయడం లేదు. దీంతో ఈ వ్యవహారంపై తెలంగాణ గట్టిగా పట్టుబట్టనుంది. ఆ తర్వాత పోతిరెడ్డి పాడు కాల్వల సామర్ధ్యం పెంపు సహా ఇతర అంశాలు చర్చకు వస్తాయి.
సయోధ్యే అసలు అజెండా....
కృష్ణానదీ ప్రాజెక్టుల్లో ఉల్లంఘనలపై చర్చించేందుకు ఈ భేటీ ఏర్పాటు చేసినప్పటికీ ఇరురాష్ట్రాల మధ్య సయోధ్య కుదర్చడమే ఈసారి భేటీ అజెండా కానున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పోతిరెడ్డిపాడుకు కౌంటర్ గా పాలమూరు-రంగారెడ్డి పథకాన్ని ఏపీ సర్కార్ తెరపైకి తెస్తున్న నేపథ్యంలో ఈ రెండు ప్రాజెక్టులను కొనసాగిస్తూనే మరికొన్ని కొత్త ప్రతిపాదనలను ఇరు రాష్ట్రాల ముందు ఉంచేందుకు రివర్ బోర్డు కసరత్తు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
Recommended Video
ఇతర అజెండా పంపేందుకు గడువు..
కృష్ణానదిపై నిర్మిస్తున్న ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు ఉన్న ఇతరత్రా అభ్యంతరాలపై అజెండా పంపేందుకు రివర్ బోర్డు ఈ నెల 26 వరకూ గడువునిచ్చింది. ఆ తర్వాత అసలు అజెండా దీన్ని కలిపి చర్చించేందుకు తేదీ ఖరారు చేయబోతోంది. ఏదేమైనా కృష్ణానదీ జలాల వివాదాలకు రివర్ బోర్డు స్ధాయిలోనే పరిష్కారం చూపాలని కేంద్రం భావిస్తున్న తరుణంలో ఈ భేటీలో ఇరు రాష్ట్రాలు సయోధ్యకు వస్తాయా లేదా న్యాయపోరాటానికి సిద్ధపడతాయా అన్నది తేలాల్సి ఉంది.