కృష్ణా రివర్ బోర్డు కీలక భేటీ నేడే: ఏపీ లేఖతో ఉత్కంఠ..నీళ్ళ పంచాయితీ తేలుతుందా?
ఏపీ, తెలంగాణా రాష్ట్రాల మధ్య వాటర్ వార్ విషయంలో ఈ రోజు కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరగనుంది . కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల మధ్య నీళ్ళ పంచాయితీ రాష్ట్రాల విభజన నాటి నుండి తెగటం లేదు. ఇక తాజాగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద నీటి సామర్ధ్యాన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త జల జగడం మొదలైంది. ఫలితంగా ఒకరి మీద ఒకరు కృష్ణా వాటర్ బోర్డుకు ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో నేడు జరగనున్న సమావేశం ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుందో అన్న ఉత్కంఠను రేకెత్తిస్తోంది.
తెలంగాణాకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన షాక్ మామూలుగా లేదుగా .. గోదావరిపై 16 ప్రాజెక్ట్ లకు బ్రేక్
తగ్గకుండా ఆరోపణలు, ఫిర్యాదులు చేస్తున్న ఇరు రాష్ట్రాలు
పోతిరెడ్డిపాడు నుండి నీటిని ఎత్తిపోతల ద్వారా రాయలసీమలకు తరలించాలన్న ఏపీ జీవో జారీ చేయడంపై,తమ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల, అపెక్స్ కమిటీ అనుమతుల్లేకుండా నీటి సామర్ధ్యాన్ని పెంచటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది.
హైదరాబాదులోని జల సౌధాలో నేడు ఉదయం11 గంటలకు కీలక భేటీ
కృష్ణా రివర్ బోర్డు హైదరాబాదులోని జల సౌధాలో నేడు ఉదయం11 గంటలకు ఇరు రాష్ట్రాల తో సమావేశం కానుంది. జలసౌధలో బోర్డు చైర్మన్ పరమేశం ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీకి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ కార్యదర్శులు, ఈఎన్సీలు, ఇతర అధికారులు పాల్గొంటారు. ఈ సమావేశంలో చర్చించే ఎజెండా అంశాలను పంపించాల్సిందిగా బోర్డు కోరడంతో ఆంధ్ర ప్రభుత్వం బుధవారం ఆ అంశాలను పంపించింది. ఇక నేడు కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల వాదనను కృష్ణా రివర్ బోర్డు విననుంది. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్నారు. ఎవరికి వారు కృష్ణా రివర్ బోర్డు ముందు తమ వాదన గట్టిగా వినిపించటానికి సిద్ధం అవుతున్నారు.
డీపీఆర్ ల విషయంలో ఫస్ట్ కమ్ ఫస్ట్ సబ్మిట్ విధానం పాటించాలని కోరుతున్న ఏపీ
ఇక రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలు చేపట్టిన కొత్త ప్రాజెక్ట్ ల డీపీఆర్ లను ఇరు రాష్ట్రాలు ఇవ్వాలని కృష్ణా రివర్ బోర్డు ఇరు రాష్ట్రాలను ఆదేశించింది. అయితే శ్రీశైలం వద్ద తాము తలపెట్టిన రాయలసీమ దుర్భిక్ష నివారణ పథకం ఇప్పుడు కొత్తగా ప్రారంభించింది కాదని ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే స్పష్టం చేసింది. అయినప్పటికీ డీపీఆర్ ఇచ్చేందుకు అభ్యంతరం లేదనీ తెలిపింది. అయితే డీపీఆర్ల సమర్పణలో ‘ఫస్ట్ కమ్ ఫస్ట్ సబ్మిట్' విధానాన్ని పాటించాలని, తెలంగాణ ప్రభుత్వమే మొదట కొత్త పథకాలను చేపట్టినందున ముందుగా తెలంగాణా రాష్ట్రమే నివేదికలను సమర్పించాలని ఏపీ డిమాండ్ చేస్తోంది.
నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుండి నీటిని తెలంగాణా తోడేస్తుందని ఆరోపణ
ఇక అంతే కాదు నాగార్జున సాగర్ సాగర్ ఎడమ కాల్వ నుంచి నీటిని తెలంగాణ తోడేస్తోందని ఏపీ ఆరోపించింది. అలాగే తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, డిండి వంటి ప్రాజెక్టుల డీపీఆర్లు కావాలని, సామర్థ్యాన్ని పెంచిన కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్ఎల్బీసీ వంటి ప్రాజెక్టులపై చర్చించాలని కోరింది.ఇక ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఏపీ విడుదల చేసిన జీవో 203పై ఫిర్యాదు చేసింది. ఎటువంటి అనుమతులు లేకుండా పోతిరెడ్డి పాడు ప్రాజెక్టువిషయంలో ఏపీ ఏకపక్ష నిర్ణయం తీసుకుందని, దానిని ఆపాలని పేర్కొన్నారు. అయితే దీనికి ప్రతిగా ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ నీటి ప్రాజెక్టులపై ఫిర్యాదు చేసింది.
కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు మార్చాలని లేఖ
ఇక నేడు సమావేశం జరగనున్న నేపధ్యంలో కృష్ణా రివర్ బోర్డు కార్యాలయాన్ని విజయవాడకు మార్చాలని ఆంధ్రప్రదేశ్ విజ్ఞప్తి చేసింది. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించాలని బుధవారం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఏది ఏమైనా ప్రాజెక్ట్ ల నిర్మాణంలో ఒకరు చేసిన తప్పులను ఒకరు ఎత్తి చూపుతూ పెద్ద యుద్ధమే జరగనుంది అన్న సంకేతాలు తాజాగా ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు రాసిన లేఖతో కనిపిస్తున్నాయి.