ఓరే పదండ్రా! అధికారుల కన్నా మత్స్యకారులే నయం: ప్రత్యక్షసాక్షుల మాటిది
Recommended Video
విజయవాడ: కృష్ణా నదిలో జరిగిన ఘోర బోటు ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిందని స్థానికులు, మత్స్యకారులు సమాచారం ఇచ్చిన అరగంటవరకు ఎవరూ సంఘటనా స్థలికి రాలేదని వారు చెప్పారు. వచ్చిన తరువాత కూడా బాధితులను రక్షించడంలో ఆలస్యం చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇసుకదిబ్బని ఢీకొట్టి, లైఫ్ జాకెట్లు అడిగినా ఇవ్వక: బోటు ప్రమాదానికి కారణాలివీ!
అధికారుల కంటే మత్స్యకారులే ముందుగా..
మత్స్యకారులు, స్థానికులే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేశారని పలువురు వ్యాఖ్యానించారు. మృతుల గాలింపు సమయానికి వచ్చిన అధికారులు.. తీరిగ్గా కార్యక్రమాలు వీక్షించారని ప్రత్యక్ష సాక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు బాధ్యతారాహిత్యంగా ఉన్నారని, ఎన్డీఆర్ఎఫ్ దళాలు మాత్రం వచ్చిన వెంటనే గాలింపు చేపట్టాయని చెప్పారు. బోటు అనుమతిచ్చి అధికారులే ఈ ప్రమాదానికి కారణమయ్యారని స్థానికులు ఆరోపించారు. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే పడవ బోల్తా పడి 17మంది ప్రాణాలు కోల్పోయారిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరో ఏడుగురు గల్లంతయ్యారు.
పదండ్రా అంటూ..
ప్రమాదం జరగిని వెంటనే ‘ఒరే!.. బోటు తిరగబడిపోయింది పదండ్రా'.. అంటూ మరో ఆలోచన చేయకుండా ముందుకు కదిలామని ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్షులైన మత్స్యకారులు తెలిపారు. పవిత్ర సంగమం వద్ద హారతి కార్యక్రమాన్ని మరింత బాగా చూసేందుకు పర్యాటకులు నదిలోకి వస్తారని వారు చెప్పారు. తమ బోట్లలో వారిని కొంత దూరంతీసుకెళ్లేందుకు తలా ఒక్కింటికి 20 రూపాయలు వసూలు చేసి, నీటి ఒరవడి ఆధారంగా కొంత దూరం తీసుకెళ్తామని అన్నారు. రివర్ బోటు ఎడ్వెంచర్స్ కు చెందిన మెకనైజ్డ్ బోటు పర్యాటకులతో విజయవాడ నుంచి రావడం చూశామని ఆయన చెప్పారు. అలా వస్తున్న బోటు నీటి ఒరవడికి పూర్తి వ్యతిరేకంగా ఉందని, ఇంతలో ఒక్కసారిగా ఊగిపోవడం ప్రారంభించిందని, అయితే ప్రయాణికులు ఆనందం తట్టుకోలేక బోటును ఊపుతున్నారని భావించామని తెలిపారు.
గుండె ఆగినంత పని.. 15మందిని కాపాడాం
తన బోటులో ముగ్గురు పర్యాటకులు ఉండడంతో వారిని దించేసేందుకు వెళ్తున్నానని ఆయన చెప్పారు. ఇంతలో హాహాకారాలు వినిపించాయని, వెనక్కి తిరిగి చూసేసరికి బోటు బోల్తా పడిపోయిందని అన్నారు. దీంతో ఒక్కసారిగా గుండె ఆగినంత పనైందని ఆయన అన్నారు. వెంటనే వెనక్కి వెళ్లడం మానేసి, దగ్గర్లోని మరో మూడు బోట్లలో ఉన్న స్నేహితులతో.. 'ఒరేయ్! బోటు బోల్తాపడింది పదండ్రా'...! అని గట్టిగా అరుస్తూ ముందుకు వెళ్లానని ఆయన చెప్పారు. అప్పటికే ఈతకొట్టేందుకు కష్టపడుతున్న 15 మందిని రక్షించానని ఆయన అన్నారు. మళ్లీ వెళ్లే సరికి ఎవరూ కనబడలేదని ఆయన చెప్పారు.
కళ్ల ముందే ఘోరం..
కళ్ల ముందే తోటి మనిషి సజీవ సమాధి కావడం బాధగా ఉందని ఆయన చెప్పారు. డ్రైవర్ కు నదీ జలాలపై అవగాహన లేకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆయన అన్నారు. అక్కడ లోతు కేవలం 10 నుంచి 15 అడుగుల మేర మాత్రమే ఉంటుందని ఆయన అన్నారు. అలాంటి ప్రాంతానికి బోటు వెళ్లడం ప్రమాదకరమని ఆయన చెప్పారు. అంతే కాకుండా నీటి ఒరవడిని బట్టి బోటును నిలపాల్సి ఉంటుందని, ఒరవడికి అడ్డంగా బోటును నిలిపాడని ఇది కూడా ప్రమాదానికి కారణమని ఆయన చెప్పారు.
వదిలిపెటేది లేదు.. మృతులకు పరిహారం..
కృష్ణానది నదిలో బోల్తాపడిన బోటు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఉపముఖ్యమంత్రి చినరాజప్ప ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ ప్రమాదానికి కారణమైన ఎవరినీ వదిలిపెట్టేది లేదని ఆయన హెచ్చరించారు. సహాయక చర్యలకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు, అదనపు బలగాలను కూడా పంపామని అన్నారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన వారిలో చంద్రన్న బీమా ఉన్నవారికి 10 లక్షల రూపాయలు, చంద్రన్న బీమా లేని వారికి 8 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియాగా అందజేయనున్నామని ఆయన తెలిపారు.