కృష్ణా జలాలు: ఏపీకి 519 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు
హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. అనంతరం కృష్ణానదీ జలాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు పంపకాలను పూర్తి చేసింది. న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ, ఏపీ రాష్ర్టాల అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ నీటి పంపకాలకు సంబంధించి రెండు రాష్ర్టాల అభ్యంతరాలపై కృష్ణా బోర్డు యాజమాన్యం చర్చించింది. ఏ ప్రాజెక్టు నుంచి ఏ సమయంలో ఎవరు ఎంత నీటిని వాడుకోవాలనే అంశంపై వివరాలు వెల్లడించింది.
నీటి పంపకాలు:
కృష్ణానదీ పరివాహార ప్రాంతంలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులున్నాయి. దీంతో శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీకి 519 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించింది.
అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 164 టీఎంసీలు, తెలంగాణకు 100 టీఎంసీలు కేటాయించారు. ఇక ప్రకాశం బ్యారేజికి 181.2 టీఎంసీలు కేటాయింపు చేస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది.
ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరితో కృష్ణానదీ యాజమాన్య బోర్డు తాత్కాలిక భేటీ నిర్వహించింది. నీటి లభ్యత వివరాలపై తాత్కాలిక కమిటీ ఓ నిర్ణయం తీసుకుంది. అనంతరం కృష్ణానదీ యాజమన్య బోర్డు ఛైర్మన్ ఎస్కేజీ పండిట్ మాట్లాడుతూ ఇరు రాష్ట్రాల మధ్య విబేధాలు రాకుండా కేటాయింపులు చేయడమే తమ బాధ్యత అని తెలిపారు.
తప్పనిసరి అయితే కేంద్ర జలవనరుల శాఖ జోక్యం చేసుకుంటుందని వివరించారు. ఇది ఇలా ఉంటే విజయవాడలో భారీగా వర్షాలు పడటంతో, త్రాగు నీటి కోసం గురువారం ప్రకాశం బ్యారేజీ నుంచి కలెక్టర్ బాబు 250 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.