తీవ్ర ఉద్రిక్తత: కెసిఆర్కు ఫోన్ బాబు, గవర్నర్ చెంత చర్చలు
హైదరాబాద్: ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నాగార్జునసాగర్ వద్ద కృష్ణా జలాల వివాదం గవర్నర్ నరసింహన్ కోర్టుకు చేరింది. రేపు శనివారంనాడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గవర్నర్ సమక్షంలో సాగర్ జలాలపై మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నారు. సాగర్ నీటిపై ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుని, ఆనకట్ట వద్ద ఇరు రాష్ట్రాల అధికారులు, పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
వివాదం తీవ్ర రూపం దాల్చిన నేపథ్యంలో చంద్రబాబు కెసిఆర్తో ఫోన్లో మాట్లాడారు. గవర్నర్ సమక్షంలో చర్చించుకుందామని చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు కెసిఆర్ అంగీకరించారు. తొలుత కెసిఆర్ చంద్రబాబుకు అందుబాటులోకి రాలేదని వార్తలు వచ్చాయి. కానీ, వారిద్దరి మధ్య ఫోన్లో సంభాషణ జరిగినట్లు ఆ తర్వాత వార్తలు వచ్చాయి. రేపు శనివారం ఉదయం పది గంటలకు ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య గవర్నర్ సమక్షంలో చర్చలు జరగనున్నాయి.
నాగార్జునసాగర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న నేపథ్యంలో పరిస్థితిని చంద్రబాబు అధికారులతో సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు, డిజిపి రాముడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కృష్ణారావులతో చంద్రబాబు మాట్లాడారు. సంయమనం పాటించాలని చంద్రబాబు వారికి సూచించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు డిఐజి చెప్పారు.
శుక్రవారం సాయంత్రం నాగార్జున సాగర్ ఆనకట్ట వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ కుడిగట్టు కాలువ నుంచి ఆరు క్యూసెక్కుల నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బలవంతంగా నీరు విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ అధికారులు ప్రయత్నించారు. దాన్ని తెలంగాణ అధికారులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ స్థితిలో ఇరు వైపులా ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించారు. తోపులాట కూడా చోటు చేసుకుంది.
సాగర్ డ్యాం వద్ద ఉన్న ఇరు రాష్ర్టాల పోలీసుల మధ్య ఘర్షణ జరగి ఏడుగురు గాయపడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఎస్పీలు రంగంలోకి దిగారు. తెలంగాణ నుంచి నల్గొండ ఎస్పీ, ఆంధ్రప్రదేశ్ నుంచి గుంటూరు జిల్లా ఎస్పీ సాగర్ డ్యాం వద్దకు చేరుకున్నారు. ఇరు రాష్ర్టాల పోలీసులతో చర్చలు జరిపారు. పరిస్థితిని ప్రశాంతంగా ఉంచేందుకు ప్రయత్నాలు చేశారు.
సాగర్ డ్యాం వద్ద పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. సాగర్ డ్యాం గేట్లు తెరిపించాలని, వద్దని ఆంధ్రా, తెలంగాణ అధికారులు భీష్మించుకు కూర్చోవడంతో ఇరు రాష్ర్టాల పోలీసులు రంగంలోకి దిగారు. ఎవరి అధికారులను వారు కాపాడుకునే క్రమంలో ఇరు రాష్ర్టాల పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. వీరి మధ్య జరిగిన తోపులాట, ఘర్షణలో ఏడుగురు పోలీసులు గాయపడ్డారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.