జూన్ 4న సమావేశం కానున్న కృష్ణాబోర్డు ... తెలుగురాష్ట్రాల వాటర్ వార్ తో ఉత్కంఠ.. ఏం తేలనుందో !!
కృష్ణానదిపై నిర్మించిన ప్రాజెక్టుల విషయంలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ల మధ్య జల జగడం ఉత్కంఠను రేకెత్తిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలు కృష్ణా రివర్ బోర్డుకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నాయి. పోతిరెడ్డిపాడు నుండి నీటిని ఎత్తిపోతల ద్వారా రాయలసీమలకు తరలించాలన్న ఏపీ జీవో జారీ చేయడంపై,తమ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలుగుతుందని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఇక ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం నిర్మిస్తున్న ప్రాజెక్టుల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు భంగం కలుగుతుందని అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది.
తెలంగాణాకు ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన షాక్ మామూలుగా లేదుగా .. గోదావరిపై 16 ప్రాజెక్ట్ లకు బ్రేక్
హైదరాబాదులోని జల సౌధాలో జూన్ 4వ తేదీన కృష్ణా బోర్డు సమావేశం
ఇరు రాష్ట్రాల ఫిర్యాదుల మేరకు కృష్ణా రివర్ బోర్డు హైదరాబాదులోని జల సౌధాలో జూన్ 4వ తేదీన ఉదయం11 గంటలకు ఇరు రాష్ట్రాల తో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లుగా పేర్కొంది. ఇక దీనికి సంబంధించిన సమాచారాన్ని కృష్ణా రివర్ బోర్డు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు అందించింది. దీంతో కృష్ణా జలాలపై ఇరు రాష్ట్రాల వాదనను కృష్ణా రివర్ బోర్డు జూన్ 4న విననుంది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుండి నీటిని ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు తరలించాలని నిర్ణయం తీసుకుని జీవో జారీ చేసిందో అప్పటినుండి ఇరు రాష్ట్రాల మధ్య కొత్త జల వివాదం మొదలైంది.
తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న వాటర్ వార్
తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ క్రమక్రమంగా ముదురుతూ వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం నిర్ణయంపై ఏపీ ప్రభుత్వంతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఇక దీంతో తెలంగాణలో నిర్మించిన కల్వకుర్తి, ఎస్ఎల్బిసి,నెట్టెంపాడుల సామర్థ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని,ఇక వాటికి ఎలాంటి అపెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోలేదని ఏపీ ప్రభుత్వం కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది.
తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రాజెక్ట్ ల వివరాలు ఇవ్వాలని ఆదేశం
ఇక ఏపీ ప్రభుత్వం చేసిన ఫిర్యాదు మేరకు కృష్ణా రివర్ బోర్డు తెలంగాణ రాష్ట్ర నిర్మించిన ప్రాజెక్టుల వివరాలు, వాటి సామర్థ్యం వివరాలు సమర్పించాలని తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి లేఖ రాసింది. ఇక ప్రాజెక్ట్ ల డీపీఆర్ లను కూడా సమర్పించాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా రివర్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు ఇరు రాష్ట్రాల మధ్య కృష్ణా నదీ జలాల వాడకం విషయంలో అనేక అంశాలపైన కూడా చర్చించాలని నిర్ణయించిన బోర్డు జూన్ 4న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు, అన్ని వివరాలతో రావాలని పేర్కొంది. అసలు తాజాగా ఇరు రాష్ట్రాల మధ్య వివాదానికి కారణమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విషయంలో కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ .. ఏం జరుగుతుందో !!
ఏది ఏమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన నాటి నుండి నేటి వరకు నీళ్ల పంచాయతీ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఇక ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరూ తమ రాష్ట్రాల ప్రయోజనం కోసం వెనక్కు తగ్గేది లేదని తేల్చి చెబుతున్నారు. సీఎం కేసీఆర్,ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇద్దరూ నదీజలాల విషయంలో గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇక ఈ సమయంలో కృష్ణా బోర్డు సమావేశంపై తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠ నెలకొంది.ఈ సమావేశం తర్వాత భవిష్యత్తులో ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి సంబంధాలు కొనసాగుతాయి? ఈ సమావేశం కృష్ణా నదీ జలాలపై ఏమి తేల్చనుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.