ప్రభాస్ రాజకీయాల్లోకి..?: కృష్ణంరాజు స్పందన ఇది, ‘పవన్, జగన్ సభలకు జనాలు వస్తారు కానీ..’
Recommended Video
హైదరాబాద్/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాపం పండే రోజు దగ్గరలోనే ఉందని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు అన్నారు. విజయవాడలో సోమవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
టీడీపీ పరిస్థితి దారుణం: బాబుపై కృష్ణంరాజు విమర్శలు, 'జగన్ పాదయాత్ర మంచిదే'
చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నారని కృష్ణంరాజు మండిపడ్డారు. ప్రతీ పనిలోనూ టీడీపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.
ఎక్కడ్నుంచైనా పోటీ..
బీజేపీ అధిష్ఠానం ఆదేశిస్తే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తు వల్ల నష్టపోయామని టీడీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని, నిజానికి బీజేపీతో పొత్తు వల్లే ఆ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయని కృష్ణంరాజు చెప్పారు.
ప్రభాస్కు ఇంకా సమయం ఉంది..
ప్రముఖ టాలీవుడ్ హీరో, తన సోదరుడి కుమారుడు ప్రభాస్ రాజకీయ రంగ ప్రవేశంపై కృష్ణంరాజు స్పందిస్తూ.. దానికి ఇంకా సమయం ఉందన్నారు. ప్రభాస్ చిత్ర పరిశ్రమలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాడని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రచారానికి ప్రభాస్ను ఉపయోగించుకునే ఉద్దేశం తమకు లేదని కృష్ణంరాజు స్పష్టం చేశారు.
ప్రభాస్కు అవసరం లేదు
ప్రభాస్ ఎదుగుతున్న నటుడని, మూడున్నరేళ్లు ఎంతో శ్రద్ధతో కష్టపడి అంతర్జాతీయ స్థాయికి ఎదిగాడన్నారు. పదేళ్లతోనే సినిమా జీవితం అయిపోలేదని, ఇంకా పాతికేళ్లు నటించాల్సిన ప్రభాస్కు అప్పుడే రాజకీయాలు అవసరం లేదని చెప్పారు. ప్రభాస్ను ప్రధాని మోడీకి గతంలో కృష్ణంరాజు పరిచయం చేసిన విషయాన్ని మీడియా గుర్తు చేయగా.. పరిచయాలకు రాజకీయాలకు సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
పవన్ను ఫాలో అవడం లేదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను తాను అంతగా ఫాలో అవడంలేదని, ఆ పార్టీ విధివిధానాలేంటి.? ఎన్నికల్లో అజెండా ఏమిటో పవన్ వెల్లడించాక దానిపై స్పందిస్తానని కృష్ణంరాజు తెలిపారు.
పవన్, జగన్ సభలకు జనం వస్తున్నారు కానీ..
పవన్, వైసీపీ అధినేత జగన్ సభలకు భారీగా జనం వస్తున్న విషయాన్ని ప్రస్తావించగా.. సభలకు, యాత్రలకు వచ్చే జనం అందరూ ఓటర్లు కాదని చెప్పారు. రాజీవ్గాంధీ హయాంలో తాను కాంగ్రెస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తే జనం విపరీతంగా వచ్చారని, కానీ గెలుపు దక్కలేదని గుర్తు చేశారు. రాష్ట్రంలో బీజేపీని విలన్ను చేసేందుకు టీడీపీ ఎంత ప్రయత్నించినా.. ఎన్నికల నాటికి అవన్నీ అబద్ధాలని తెలుస్తాయని కృష్ణంరాజు చెప్పారు.