టీడీపీ పరిస్థితి దారుణం: బాబుపై కృష్ణంరాజు విమర్శలు, ‘జగన్ పాదయాత్ర మంచిదే’
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై బీజేపీ సీనియర్ నేత కృష్ణంరాజు విమర్శలు గుప్పించారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతోంది చంద్రబాబు సర్కారేనని మండిపడ్డారు.
Recommended Video
బాబుపై ఒకప్పుడు సానుభూతి
సోమవారం ఓ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణం రాజు మాట్లాడుతూ..
దేశంలో విపక్షాలు ఏకతాటిపై లేవన్నారు. రోజులో 20గంటలు పనిచేస్తారని.. చాలా కష్టపడతారని చంద్రబాబుపై తనకు ఒకప్పుడు సానుభూతి ఉండేదని అన్నారు. ఇప్పుడు కూడా పనిచేస్తున్నారని.. అయితే అబద్ధాలు నిజం చేయడానికి.. నిజాలను అబద్ధాలు చేయడానికి అన్నట్టు ఉందని ఎద్దేవా చేశారు.
బాబు తన అభివృద్ధి కోసమే..
చంద్రబాబు తనను తాను రక్షించుకోవడానికి ప్రధాని మోడీనిని, బీజేపీని విమర్శిస్తున్నారన్నారని కృష్ణంరాజు మండిపడ్డారు. ఒకనాడు రాష్ట్రాభివృద్ధికి పని చేసిన చంద్రబాబు.. ఇప్పుడు తన అభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు.
తప్పుడు లెక్కలు
పోలవరం విషయంలో చంద్రబాబు సర్కారు వేలకోట్ల అంచనాలు పెంచారని అన్నారు. పోలవరంపై రోజుకో లెక్క చెబుతున్నారని మండిపడ్డారు. మొత్తం 30వేల కోట్ల లెక్కలు చెబుతున్నారని.. 10-15వేలకోట్లు అయ్యేదానికి 30వేల కోట్లు లెక్కలు చెప్పడం ఏంటని ప్రశ్నించారు.
టీడీపీతో మోసపోయాం
పోలవరం, కడప ఉక్కుతో సహా విభజన హామీలన్నీ బీజేపీ ప్రభుత్వం నెరవేరుస్తుందని కృష్ణంరాజు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును ప్రధాని మోడీ పూర్తి చేస్తారని చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకుని మోసపోయామన్నారు. చంద్రబాబు ఇచ్చిన 600హామీల్లో ఏం అమలు చేశారని కృష్ణంరాజు ప్రశ్నించారు.
జగన్ పాదయాత్ర మంచిదే
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రపై స్పందిస్తూ.. దివంగత నేత వైయస్సార్లా వైయస్ జగన్ పాదయాత్ర చేయడం మంచిదేనని అన్నారు. ప్రజలు సమస్యలు తెలుస్తాయని అన్నారు. తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా యాత్ర చేస్తున్నారని ఈ సందర్భంగా చెప్పారు.