చాలా ఇచ్చాం: కృష్ణంరాజు, బాబుకు బిజెపి 'కాపు' షాక్.. వీర్రాజుకు పగ్గాలు?
రాజమహేంద్రవరం: ఏపీని కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మాజీ కేంద్రమంత్రి, బిజెపి నేత కృష్ణం రాజు అన్నారు. పోలవరానికి రూ.1600 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. రాజధాని నిర్మాణానికి రూ.1500 కోట్లు అందించామన్నారు.
ఏపీ బిజెపి అధ్యక్షులు కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ... విభజన సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించలేదన్నారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిఉందన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పార్టీ అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు.
ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణం బిజెపి ప్రభుత్వ బాధ్యతని అభిప్రాయపడ్డారు. అంతకుముందు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. టిడిపి అధికారం చేపట్టి ఇరవై నెలలు అయిందని, ఇంత వరకు ఏమీ చేయలేదని విరుచుకుపడ్డారు.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం కేటాయించిన నిధులను ప్రభుత్వం పక్కదారిపట్టించిందని అన్నారు. పట్టిసీమ పోలవరంలో భాగమా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం కేటాయించిన నిధుల్లో కుడి కాల్వకు కేవలం రూ.700 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని మిగిలిన రూ.1500 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు.
పోలవరంలో ఇప్పటి వరకు కేవలం ఒకటిన్నర శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, ఇంకా 98 1/2శాతం పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. కేంద్రానికి ఏపీ ప్రభుత్వం చెబుతోంది ఏమిటి? రాష్ట్రంలో చేస్తోంది ఏమిటన్నారు. బిజెపి ప్రతిష్ఠను దిగజార్చడంలో భాగంగా ఏపీలో గొబెల్స్ ప్రచారం జరుగుతోందన్నారు.
కాపు ప్లాన్.. సోము వీర్రాజుకు ఏపీ పగ్గాలు?
ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులకే బాధ్యతలు అప్పగించాలని ఆరెస్సెస్ ప్రతిపాదన చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి బిజెపి నాయకత్వం కూడా ఆమోదముద్ర వేసిందని తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేత సోము వీర్రాజుకు ఏపీ పగ్గాలు అప్పగించే అవకాశాలున్నాయని అంటున్నారు. కాపులను మచ్చిక చేసుకునేందుకు చంద్రబాబు, జగన్, బిజెపిలు పోటీ పడుతున్న విషయం తెలిసిందే.