ఇవన్నీ అమిత్ షాకు చెప్పండి!: కృష్ణంరాజుతో మోడీ, కీలక నివేదికలు అందజేత
న్యూఢిల్లీ/అమరావతి: ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షాను, ప్రధాని నరేంద్ర మోడీలను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాల పైన వారితో చర్చించారని తెలుస్తోంది. వారికి కీలక నివేదికలు అందించారని తెలుస్తోంది.
Recommended Video
ఏపీలో వెనుకబడిన జిల్లాలు, ప్రాంతాలపై కూడా ఓ నివేదికను అందించారని సమాచారం. ఆయన బుధవారం వారిని కలిశారు. కీలక నివేదికలు అందించడం గమనార్హం. కృష్ణంరాజు మొదట ప్రధాని మోడీని కలిశారు. ఆయన ఏపీలోని పరిస్థితులను ఆయనకు వివరిస్తుండగా అన్ని విషయాలను అమిత్ షాకు చెప్పాలని సూచించారు. దీంతో నివేదికతో పాటు ఏపీలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రత్యేక హోదాపై ప్రజల మనోభావాలు తదితర అంశాలపై అమిత్ షాకు నివేదిక ఇచ్చారని తెలుస్తోంది.
మాచర్ల - నల్గొండ రైల్వే ప్రాజెక్టుపై తేల్చేసిన కేంద్రం
ఏపీలోని మాచర్ల, తెలంగాణలోని నల్గొండ మధ్య ప్రతిపాదించిన రైల్వే మార్గం నిర్మాణం సాధ్యంకాదని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తేల్చి చెప్పారు. ఈ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం ఉచితంగా భూమి ఇచ్చి, ప్రాజెక్టు వ్యయంలో 75% భరించినా ఆర్థికంగా లాభదాయకం కాదన్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (ఆరెస్సెస్) నేతలు ఏపీలో మూడు రోజుల పాటు సదస్సు నిర్వహించనున్నారు. ఆగస్టులో ఇది జరగనుందని తెలుస్తోంది. దేశం ఎదుర్కొంటున్న సామాజిక, సాంస్కృతిక సమకాలిన అంశాలపై వారు ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సదస్సుకు పలువురు కీలక ఆరెస్సెస్ నేతలు హాజరు కానున్నారని తెలుస్తోంది.