ఆ రాజులిద్దరిని టార్గెట్ చేసిన వైసీపీ- మధ్యలో ఇరుక్కున్న వెల్లంపల్లి- క్షత్రియుల గుర్రు
ఏపీలో 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోవడానికి గల కారణాల విశ్లేషణలో వారికి దొరికిన ఓ కారణం క్షత్రియ సామాజిక వర్గం దూరం కావడం. రాష్ట్ర జనాభాలో గణనీయమైన సంఖ్యలో లేకపోయినా కొన్ని ప్రాంతాల్లో కచ్చితంగా ప్రభావం చూపగల వర్గంగా పేరున్న క్షత్రియులను దూరం చేసుకోవడం ద్వారా వైసీపీ అప్పట్లో నష్టపోయిందన్న విశ్లేషణలు వినిపించాయి. క్షత్రియులను ఉద్దేశించి వైఎస్ జగన్ అప్పట్లో ఏవో విమర్శలు చేశారన్న ప్రచారం జరిగింది. దీనికి విరుద్ధంగా 2019 ఎన్నికల నాటికి టీడీపీకి చిన్నా చితకా కారణాలతో ఒక్కో సామాజిక వర్గం దూరమవుతుంటే వ్యూహాత్మకంగా వారిని అక్కున చేర్చుకోవడం ద్వారా వైసీపీ సంచలన ఫలితాలు సాధించింది. ఇప్పుడు తిరిగి అవే వర్గాలను వైసీపీ దూరం చేసుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
క్షత్రియులతో వైసీపీ అనుబంధం
గతంలో క్షత్రియ సామాజిక వర్గంపై వైసీపీ నేతలు చేశారని భావిస్తున్న విమర్శలతో 2014లో ఆ పార్టీకి దూరమైన వారంతా తిరిగి 2019 నాటికి వైసీపీకి చేరువయ్యారు. 2014లో స్వల్ప తేడాతో అధికారం దూరం కావడంతో వైఎస్ జగన్ ఐదేళ్లలో దానికి గల కారణాలు విశ్లేషించుకుని తిరిగి పోగొట్టుకున్న చోటే రాబట్టుకున్నారు. ఇందులో క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కనుమూరు రఘురామకృష్ణంరాజు, ముసునూరి ప్రసాదరాజు వంటి వారు కలిసికట్టుగా పనిచేసి గోదావరి జిల్లాలతో పాటు పలు చోట్ల వైసీపీకి ఘనవిజయాన్ని కట్టబెట్టారు. కానీ విచిత్రంగా ఇందులో మంత్రిగా ఉన్న చెరుకువాడ, ఎమ్మెల్యేగా ఉన్న ప్రసాదరాజు పార్టీతోనే ఉన్నా రఘురామకృష్ణంరాజు మాత్రం దూరమయ్యారు.
క్షత్రియులతో దూరం పెరిగిందిలా...
గతేడాది డిసెంబర్లో నరసాపురం నుంచి వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు ఆ పార్టీతో విభేదించడం మొదలుపెట్టారు. హైందవ సంబంధిత అంశాలతో మొదలుపెట్టిన ఆయన విమర్శల పర్వం మొదట్లో ప్రభుత్వంపై సాగినా ఇప్పుడు నేరుగా సీఎం జగన్పైనే సాగుతోంది. పార్టీతో విభేదించిన రఘురామరాజును ఆయన మానాన వదిలిపెడితే సరిపోయే దానికి నరసాపురంలో వైసీపీ నేతలంతా కలిసి టార్గెట్ చేసి విషయం పెద్దదిగా మార్చేసారు. దీని వల్ల రాజకీయంగా కానీ, ఇతరత్రా కానీ ఏమైనా లబ్ది పొందారా అంటే అదీ లేదు. మరోవైపు టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న విజయనగరం పూసపాటి వంశీయుల వారసుడు అశోక్ గజపతిరాజును ఈ ఏడాది మార్చి నుంచి వైసీపీ సర్కారు టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. అనూహ్యంగా ఆయన ధర్మకర్తగా ఉన్న ఆలయాల పదవుల నుంచి తొలగిస్తూ ఆయన అన్నకూతురు సంచైతకు వయసుకు మించిన భారాన్ని అప్పగిస్తూ వైసీపీ చేస్తున్న రాజకీయం విమర్శలకు తావిస్తోంది.
రఘురామను వదిలేస్తే పోయే దానికి...
క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన కనుమూరు రఘురామకృష్ణంరాజుకు పార్టీలకతీతంగా పశ్చిమగోదావరి జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ పట్టుంది. దీన్ని గుర్తించే టీడీపీ గతంలో ఆయన్ను అక్కునచేర్చుకుంది. కానీ టీడీపీ గెలిచే పరిస్దితి లేకపోవడంతో ఆయన వైసీపీలోకి ఫిరాయించి గెలిచారు. గతంలో బీజేపీలో ఉన్నప్పటికీ వైసీపీ గెలవకుండా ఆయన సామాజిక వర్గానికి చెందిన గోకరాజు గంగరాజును ఎంపీని చేయడంలో రఘురామ కీలక పాత్ర పోషించారు. ఆర్ధికంగా బలవంతుడు, కాంగ్రెస్ నేత వైసీపీ వియ్యంకుడు కూడా అయిన రఘురామకృష్ణంరాజు పార్టీతో విభేదించారనే కారణంతో సాధారణ నేతల్లా ఆయన్ను ట్రీట్ చేయడం మొదలుపెట్టిన వైసీపీ.. ఇప్పుడు అందుకు తగ్గ ఫలితాన్ని అనుభవిస్తోంది.. టీడీపీ నేతల కంటే దారుణంగా రోజూ ప్రభుత్వ విధానాలపై ఆయన విరుచుకుపడుతున్నారు. అదే ఆయన వ్యవహారాన్ని చూసీ చూడనట్లుగా వదిలేస్తే ఇంత వరకూ వచ్చేది కాదన్నది వాస్తవం.
మర్యాదస్తుడు అశోక్ను టార్గెట్ చేసి...
విజయనగరం జిల్లా రాజకీయాల్లో గెలుపోటములు చవిచూసిన కురువృద్ధుడు, పూసపాటి వంశ వారసుడు అయిన అశోక్ గజపతిరాజును కేవలం ప్రత్యర్ధి పార్టీ కావడం అన్న ఒకే కారణంతో వైసీపీ టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. నిబంధలను సవరించి మరీ కీలకమైన మాన్సాస్, సింహాచలం ట్రస్టు బోర్డుల నుంచి ఆయన్ను తప్పించింది అయితే అశోక్కు వచ్చిన గౌరవం కాదనేది విజయనగరం జిల్లాలో ఎవరిని అడిగినా చెబుతారు. రాజకీయాల్లో ఉన్నా ప్రత్యర్ధులపై తీవ్రమైన రాజకీయ విమర్శలు చేసిన చరిత్ర అశోక్కి లేదు. ప్రజల్లోకి నేరుగా వెళ్లడం కనిపించడం మినహా వారిని ఆయన నేరుగా ఓటు అడిగిన దాఖలాలు కూడా కనిపించవు. అలాంటి వ్యక్తిని టార్గెట్ చేయడం ద్వారా వైసీపీ కక్షా రాజకీయాలకు తెరలేపిందనే విమర్శలు ఎదుర్కొంటోంది.
Recommended Video
వెల్లంపల్లి తీరుపై క్షత్రియుల ఆగ్రహం
వైసీపీ నేతలు అశోక్ గజపతిరాజును, రఘురామకృష్ణంరాజును టార్గెట్ చేసే క్రమంలో ఈ వివాదాలతో సంబంధం లేని ఇతరులు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి టార్గెట్ అవుతున్నారు. ఇలాంటి వారిలో దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ముందున్నారు. అశోక్ గజపతిరాజును కీలకమైన ఆలయ పదవుల నుంచి తప్పిస్తూ దేవాదాయశాఖ ఇస్తున్న జీవోలతో ఇప్పటికే వెల్లంపల్లిపై ఆ సామాజిక వర్గం గుర్రుగా ఉంది. అయితే తాజాగా రామతీర్గం ఘటన తర్వాత దీనికి బాధ్యుడిని చేస్తూ ఆలయ ఛైర్మన్గా ఉన్న అశోక్ గజపతిరాజును తప్పించడమే కాకుండా ఆయనపై తీవ్ర విమర్శలకు దిగిన వెల్లంపల్లిపై క్షత్రియులు మండిపడుతున్నారు. వెల్లంపల్లికి వ్యతిరేకంగా దిష్టిబొమ్మల దహనంతో పాటు ఇతరత్రా నిరసనలు కూడా చేపడుతున్నారు.