తెరపై కనిపించకుండా చేయాలని ప్రయత్నించారు: కొమ్మినేని
హైదరాబాద్: తాను ఎక్కడా తెర మీద కనిపించకుండా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస రావు చెప్పారు. సాక్షి మీడియాలో తాను చేరిన విషయాన్ని ఆయన ధ్రువీకరించారు. ఇతర చానెళ్లలో అవకాశం రాకుండా తనను అడ్డుకున్నారని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వ ఒత్తిళ్ళ కారణంగా ఎన్టీవి న్యూస్ చానల్ ని వదిలిపెట్టిన కొమ్మినేని శ్రీనివాస రావు సాక్షి మీడియాలో చేరినట్లు ప్రకటించారు. తనకి మళ్ళీ తెరపై కనిపించేందుకు అవకాశం ఇచ్చిన సాక్షి యాజమాన్యానికి కృతజ్ఞతలు చెప్పారు.
మారిన గూడు: జగన్ సాక్షి మీడియాలో ఇక లైవ్ విత్ కెఎస్ఆర్
తనకు తెరపై కనిపించే అవకాశం ఇవ్వడమే కాకుండా కెసిఆర్ లైవ్ షోను నిర్వహించే అవకాశం కూడా సాక్షి యాజమాన్యం ఇచ్చిందని ఆయన చెప్పారు. తనకు జరిగిన అన్యాయంపై మూడు నెలలుగా చాల మంది సంఘీభావం తెలిపారని ఆయన చెప్పారు.
కొందరు తన ఇంటికి వచ్చి ధైర్యం చెప్పినట్లు ఆయన తెలిపారు. ప్రజల భజన కోరుకోరని, తమ పక్షాన ప్రశ్నించాలని కోరుకుంటారని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే కారణంతో యాజమాన్యంపై పెట్టిన ఒత్తిడి కారణంగా కొమ్మినేని ఎన్టీవీ నుంచి తప్పుకున్నారు. ఆ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పారు.