షరతులు: సాక్షిలోకి కేఎస్ఆర్, జగన్ సతీమణి భారతి కోరిక?
హైదరాబాద్/విజయవాడ: ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస రావు సాక్షిలో చేరారు. ఇక సాక్షి టీవీలో కేఎస్ఆర్ లైవ్ షో ప్రారంభం కానుంది. ఈ చర్చ కార్యక్రమాల్లో వైసిపి అధినేత జగన్ తీరు పైన విశ్లేషణలు ఉండే అవకాశముందా? అనే చర్చ సాగుతోంది.
సాక్షి ఛానల్లో పని గంటసేపు ప్రసారం కానున్న కేఎస్ఆర్ లైవ్ షో విషయమై ఆయనకు పూర్తి అధికారులు ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ఆయన సాక్షి పత్రికలో పని చేసినప్పటికీ.. అధికార, ప్రతిపక్ష పార్టీ అధినేతల పైన ముక్కుసూటిగా చర్చించవచ్చునని యాజమాన్యం చెప్పిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మారిన గూడు: జగన్ సాక్షి మీడియాలో ఇక లైవ్ విత్ కెఎస్ఆర్
కేఎస్ఆర్ నిర్వహించే గంట షోలో యాజమాన్యం జోక్యం ఏమీ ఉండదని హామీ ఇచ్చారంటున్నారు. సాక్షి యాజమాన్యం, కేఎస్ఆర్ మధ్య ఈ ముఖ్యమైన ఒప్పందం జరిగిందనే ప్రచారం సాగుతోంది. ఇదివరకు ఎలా వ్యవహరించారో.. ఇప్పుడు సాక్షిలో కూడా అలాగే వ్యవహరించవచ్చునని యాజమాన్యం చెప్పిందంటున్నారు.
సాక్షి మీడియా... వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి, ఆ మీడియాలో ఆయనకు అనుకూలంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయనే వాదన ఉన్న విషయం తెలిసిందే.
అయితే, సాక్షికి న్యూట్రల్ ఇమేజ్ కావాలని వైయస్ భారతి రెడ్డి కోరుకుంటున్నారని, అందుకే కేఎస్ఆర్ షో విషయంలో జోక్యం చేసుకోవద్దని యాజమాన్యం నిర్ణయించుకున్నారనే ప్రచారం సాగుతోంది. సాక్షి వైయస్సార్ కాంగ్రెస్ అనుకూల పత్రిక అనే అభిప్రాయాన్ని దూరం చేయాలని భావిస్తున్నారంటున్నారు. కాగా, కేఎస్ఆర్ లైవ్ షో సోమవారం నాడు ప్రసారం అయింది. తొలుత అమెరికాలో జరిగిన కాల్పుల గురించి ఆయన ఎన్నారైలతో మాట్లాడారు.