మోరీలు కట్టలేదు: కెటిఆర్, మంచికి మద్దతు: అక్బర్
హైదరాబాద్: హైటెక్ సిటీని కట్టారు గానీ మోరీలు కట్టడం మరిచిపోయారని పంచాయతీరాజ్, ఐటి శాఖల మంత్రి కెటి రామారావు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రతిపక్షం చేసిన విమర్శకు ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. హైదరాబాదును మేమే అభివృద్ధి చేశామని, హైటెక్ సిటీని కట్టామని అంటున్నారని, కానీ మోరీలు కట్టడం మరిచిపోయారని ఆయన అన్నారు. చర్చకు వస్తే తామేం చేశామో, వారేం చేశారో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన అన్నారు. కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల వల్లనే విద్యుచ్ఛక్తి సమస్య ఏర్పడిందని, నీళ్లూ బొగ్గు లేని చోట్ల విద్యుచ్ఛక్తి ప్రాజెక్టులు కట్టారని, ఆంధ్ర పక్షపాతంతో వ్యవహరించారని, అదే తమకు వచ్చిన దురదృష్టకరమైన వారసత్వమని ఆయన అన్నారు. గత ప్రభుత్వ హయాంల్లో మూతపడిన పరిశ్రమలను కొన్నింటిని కెటి రామారావు ఉదహరించారు.
తమ పార్టీపై వచ్చిన వ్యాఖ్యకు మజ్లీస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ కూడా తీవ్రంగా ప్రతిస్పందించారు. తాము ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ముందుకు వచ్చామని, రాష్ట్రంలో లౌకిక ప్రభుత్వం ఉండాలని కోరుకున్నామని, బూటకపు లౌకికవాదంతో ప్రజలు నిరాశకు గురయ్యారని, అందుకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకునే అన్ని మంచి నిర్ణయాలకు తమ మద్దతు ఉంటుందని, అదే సమయంలో ప్రతిపక్ష పార్టీగా నిర్మాణాత్మక పాత్ర పోషిస్తామని ఆయన చెప్పారు. మూతపడిన పరిశ్రమల గురించి అక్బరుద్దీన్ కూడా చెప్పారు.
అంతకు ముందు అక్బరుద్దీన్ విద్యుత్తు సమస్యపై ప్రసంగించారు. సభ్యులు చాలా మంది విద్యుచ్ఛక్తి సమస్యపై మాట్లాడకుండా వ్యవసాయ రంగం గురించి మాట్లాడారని ఆయన అన్నారు. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలని, బిఎసి నిర్ణయాలకు కట్టుబడి చర్చ సాగించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి సమస్య ప్రధానమైందని ఆయన అన్నారు. వ్యవసాయంపైనే కాకుండా పరిశ్రమలపై కూడా విద్యుత్తు కొరత ప్రభావం పడుతోందని ఆయన అన్నారు. మూడేళ్ల తర్వాత విద్యుత్తు సమస్య పరిష్కారం అవుతుందని ప్రభుత్వం అంటోందని, అయితే ఈ మూడేళ్ల వరకు రైతుల ఆత్మహత్యలు జరగాల్సిందేనా అని ఆయన అన్నారు. రైతు ఆత్మహత్యలను నిరోధించడానికి ఈలోగా తాత్కాలిక పరిష్కారాలు చేపట్టాలని ఆయన అన్నారు.
పరిశ్రమలు మూతపడకుండా చూడాల్సిన అవసరం కూడా ఉందని, ఇతర రాష్ట్రాలకు పరిశ్రమలు తరలిపోకుండా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడానికి ఆయన పలు సూచనలు చేశారు. కరెంట్ సమస్య వల్లనే కాకుండా రుణదాతల వల్ల కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. మైక్రో ఫైనాన్స్ను, రుణదాతలను నియంత్రించడానికి చట్టం తేవాలని ఆయన సూచించారు. గత టిడిపి ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడానికి కూడా నిరాకరించిందని, వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మాత్రం నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు చేపట్టిందని ఆయన చెప్పారు. బంగారు తెలంగాణ సాధన కోసం కలిసికట్టుగా పని చేద్దామని ఆయన సూచించారు.
అక్బరుద్దీన్ ప్రసంగానికి కెటి రామారావు స్పందించారు. రైతు ఆత్మహత్యలు దురదృష్టకరమని ఆయన అన్నారు. వాటిని అధిగమిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోకి రానున్న పరిశ్రమల గురించి కెటి రామారావు వివరించారు. వేయి కోట్లతో తెలంగాణలో కోకాకోలా యూనిట్ పెడుతోందని, మూడు వేల కోట్లతో ఐటిసి ప్రాజెక్టులు రాబోతున్నాయని ఆయన చెప్పారు. గూగుల్ తన శాశ్వత కార్యాలయాన్ని హైదరాబాదులో పెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. కాగ్నిజెంట్, టిసిఎస్ వంటి ఐటి పరిశ్రమలు తమ కార్యకలాపాలను విస్తరించబోతున్నాయని ఆయన చెప్పారు.