ఏపీనే ఎంచుకునేవాళ్లం, కలిసున్నాం: కేటీఆర్ ఆసక్తికరం, షాకిస్తానన్న చంద్రబాబు
హైదరాబాద్/అమరావతి: తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో జాతీయ ర్యాంకుల్లో ఏపీ, తెలంగాణలు సంయుక్తంగా మొదటి స్థానంలో నిలిచాయి.
దీనిపై కేటీఆర్ ఈ రోజు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ర్యాంకులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆన్లైన్లో పొందుపర్చిన సమాచారాన్ని ఏపీ ప్రభుత్వం చోరీ చేసిన వ్యవహారం గతంలో చర్చనీయాంశమైంది.
తెలంగాణ ప్రభుత్వ విధానాలను ఏపీ కాపి కొట్టిందని గతంలో కేంద్రానికి ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని కేటీఆర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా మేథో సంపత్తి రక్షణపై ఆందోళన వ్యక్తమవుతోందన్నారు.
ఏపీ కాపీ కొట్టిన వెంటనే కేంద్రానికి ఫిర్యాదు చేశామని, అయితే ఒకటి మాత్రం వాస్తవమని, మొదటి ర్యాంకు ఎవరితో పంచుకుంటారని ఒకవేళ కేంద్రం అడిగి ఉంటే మేం ఏపీనే ఎంచుకునే వాళ్లమని, ఎంత కాదన్నా ఇన్నాళ్లు కలిసి ఉన్నామని, తెలుగు వాళ్లమని వ్యాఖ్యానించారు.
షాకిస్తానని చెప్పిన చంద్రబాబు
తాత్కాలిక ప్రలోభాలకు లోనై లేనిపోని కష్టాలు తెచ్చుకుంటే మీ పదవి కూడా ఊడిపోతుందని టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు హెచ్చరిక చేశారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.
నాయకులు, కార్యకర్తలు ప్రజాసేవ తక్కువగా చేస్తే ప్రజలు నమ్మరని, ఎన్నికల్లో ఓట్లు పడకపోతే పార్టీ కూడా మిమ్మల్ని భరించదని, అందుకనే, నాయకులకు, కార్యకర్తలకు ఒక విషయం స్పష్టంగా చెబుతున్నానని, ప్రజలకు మనం ఆదర్శంగా ఉండాలన్నారు.
ఒక రాష్ట్రంలో, నియోజకవర్గంలో, ప్రాంతంలో టిడిపి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకునే పరిస్థితి రావాలి తప్ప, వేలెత్తి చూపించే పరిస్థితి రావొద్దన్నారు. ఒకవేళ, వేలెత్తి చూపించే పరిస్థితి వస్తే నేను కూడా నమస్కారం పెట్టే పరిస్థితి వస్తుందని, ఆ విషయం ప్రతిఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని, ఫర్వాలేదులే మన సారే కదా అని ఎవరైనా అనుకుంటే మాత్రం, నేను కూడా వారికి షాక్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు.