60ఏళ్ల దరిద్రం అప్పుడే పోదు: కెటిఆర్, క్రిమినల్ కేసులు పెడతామన్న జగదీష్
హైదరాబాద్/నిజామాబాద్: తనపై అసత్య ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి జగదీశ్రెడ్డి డిమాండ్ చేశారు. లేకుంటే క్రిమినల్ కేసు పెడతానని ఆయన హెచ్చరించారు. ఆదివారం తెలంగాణ భవన్లో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్మెంట్కు విద్యాశాఖకు సంబంధంలేదన్న మంత్రి.. కనీస పరిజ్ఞానం లేకుండా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏ అంశం ఏ శాఖ కిందకు వస్తుందో ముందుగా పొన్నం ప్రభాకర్ తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ‘మాపై విమర్శలు చేస్తోన్న వారికి విద్యాశాఖపై కనీస పరిజ్ఞానం కూడా లేదు. మాపై లేనిపోని నిందలు వేస్తున్నారు. తప్పుడు సమాచారంతో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు' అని జగదీష్ రెడ్డి అన్నారు.
పొన్నం ప్రభాకర్ కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని, తాను చేసిన ఆరోపణలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల చేత ఛీ కొట్టించుకున్న కొందరు నేతలు పిచ్చి వాగుడు వాగుతున్నారని అన్నారు. చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ పార్టీ తల్లి.. కాంగ్రెస్ నర్సు
నిజామాబాద్: తెలంగాణ రాష్ర్ట సమితి తల్లిలా ప్రయోజనం ఆశించకుండా సేవ చేస్తే.. కాంగ్రెస్ డబ్బులు తీసుకొని సేవ చేసే నర్సులాంటిదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. శనివారం ఆయన నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రిపై అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్లో ముగ్గురు మొనగాళ్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, వారి మాటలను ప్రజలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పరోక్షంగా టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, డి శ్రీనివాస్, షబ్బీర్ అలీలను ఉద్దేశించి అన్నారు. మాటిమాటికి కేసీఆర్ను బర్తరఫ్ చేయాలని, అరెస్ట్ చేయాలని అంటున్నారని, వృద్ధులు.. వితంతువుల పింఛన్ రూ. వెయ్యి, వికలాంగుల పింఛన్ రూ.1,500లకు పెంచినందుకు కేసీఆర్ను అరెస్టు చేయాలా? అని ప్రశ్నించారు.
పురుగుల అన్నానికి బదులు హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెట్టినందుకు అరెస్టు చేయాలా? అని కెటిఆర్ నిలదీశారు. 60 ఏళ్ల దరిద్రం ఆరునెలల్లో పోదని, ముఖ్యమంత్రి కెసిఆర్ రాత్రిబవళ్లు ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్నారన్నారు. వచ్చే మూడేళ్లలో ఇంటింటికీ తాగునీటిని అందిస్తామని కెటిఆర్ తెలిపారు.