ఐటీలో టాప్5లో నిలుపుతాం, 150 కంపెనీలతో: కెటిఆర్
హైదరాబాద్: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగంలో దేశంలోనే తెలంగాణను టాప్ 5లో నిలబెడతామని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు బుధవారం చెప్పారు. ఆయన సాఫ్టువేర్ కంపెనీ ఒరాకిల్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రాన్ని ఐటీ రంగంలో దేశంలోనే అత్యుత్తమంగా నిలుపుతామన్నారు. ఈ నెల 27న హోటల్ తాజ్ బంజారాలో 150 కంపెనీలతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రాబోయే ఐదేళ్లలో 15 ఏళ్లకు సరిపడా టెక్నాలజీని సమకూరుస్తామని చెప్పారు.
ఈ-పంచాయతీ, ఈ-ఎడ్యుకేషన్, ఈ-హెల్త్ సేవలను మెరుగుపరుస్తామని చెప్పారు. ఐటీఐఆర్కు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకు వస్తామన్నారు. ఐటీ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపటమే తమ లక్ష్యమన్నారు.
రాష్ట్రంలో అనర్హులకు కూడా రేషన్ కార్డులు ఉన్నాయని, పింఛన్లు అందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై చర్యలు తీసుకుంటామన్నారు. రేషన్ కార్డులు, ఫించన్లు నిజమైన లబ్ధిదారులకు చేరేలా ఐటీ పరిజ్ఞానాన్ని వినియోగిస్తామన్నారు. ఐటీ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు.