కీలక దశలో ఏపీ రాజకీయాలు, పవన్ కళ్యాణ్-జగన్లతో మాకు తగాదాల్లేవు: కేటీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కీలక దశలో ఉన్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శనివారం చెప్పారు. ఒకరిని చుసి మరొకరు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారన్నారు. ప్రజలను గందరగోళ పరుస్తున్నారన్నారు.
'అన్నీ అనుకూలిస్తే 2019లో కేసీఆర్ ప్రధాని, కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై మొన్నటి వరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అదొక సంజీవినా, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్నారని గతంలో ప్రశ్నించారని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రత్యేక హోదానే జిందా తిలిస్మాత్, అన్నింటికీ అదే పరిష్కారమని చెప్పడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.
హోదా విషయంలో గందరగోళపరుస్తున్నారు
ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబే అయోమయంలో ఉన్నారని, ప్రజలను మాత్రం గందరగోళపరుస్తున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకుంటే ఇతరుల వైఖరి ఏమిటో తెలుస్తుందని చెప్పారు. చంద్రబాబును కొంత మీడియా గొప్పగా చూస్తోందని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, చంద్రబాబు కాలికి బలపం కట్టుకుని గల్లీల్లో ప్రచారం చేసినా ప్రజలు పట్టించుకోలేదన్నారు.
జగన్, పవన్ కళ్యాణ్లతో తగాదాల్లేవు
ప్రగతిశీల ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేశారని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కార్యదక్షతకు, సమర్థతకు, ప్రభుత్వ పని తీరుకు ఓటు వేశారని కాంగ్రెస్, చంద్రబాబులకు వ్యతిరేకంగా వేసిన ఓట్లు కావు కావన్నారు. చంద్రబాబుతో గట్టు పంచాయతీలు ఏమీ లేవని చెప్పారు. వైసీపీ అధినేత వైయస్ జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లతోనూ మాకు తగాదాలు లేవని చెప్పారు. ఏపీలో కూడా ఒక ప్రాంతీయ శక్తి బలంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఎవరు అనేది మాత్రం ఆంధ్రా ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.
చంద్రబాబులా అబాసుపాలుకాము
అక్కడి ప్రజలు వారికి ఏది వాంఛనీయమో, ఏది సరైనదో నిర్ణయించుకుంటారని కేటీఆర్ చెప్పారు. కేంద్ర రాజకీయాలలో ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటున్నామో, ఏపీలో ఎలాంటి రాజకీయ వ్యవస్థ ఉంటే అక్కడి ప్రజలకు బాగుంటుందో సమయాన్ని బట్టి చెబుతామని, కానీ చంద్రబాబులాగా చెప్పి అభాసుపాలు కాబోమని చెప్పారు. దేశంలో మార్పు కోసం టీఆర్ఎస్ పాటు పడుతుంటే టీడీపీ కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు.
టీడీపీ నామమాత్రం
ఎన్నికల తర్వాత ఏపీలో కూడా టీడీపీ నామమాత్రం అవుతుందని కేటీఆర్ జోస్యం చెప్పారు. కేంద్రంలో గత 22 ఏళ్లుగా సంకీర్ణ ప్రభుత్వాలే ఉన్నాయని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ కచ్చితంగా విజయవంతం కానుందని చెప్పారు. చంద్రబాబు మాత్రం టీడీపీ బలోపేతం కోసం కూటమి కడుతున్నామని చెప్పారు. ఉమ్మడి అదిలాబాదా జిల్లా ముథోల్ నియోజకవర్గం సరిహద్దులో మహారాష్ట్రలోని ధర్మాబాద్ నియోజకవర్గం ఉన్నదని, ఆ సెగ్మెంట్లోని 40 గ్రామాలను తెలంగాణలో కలపాలని గ్రామ పంచాయతీలు తీర్మానాలు చేశాయని, ఆ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న శివసేన ఎమ్మెల్యే సైతం దీనికి మద్దతు తెలిపారని చెప్పారు.