సూపర్: పవన్ కళ్యాణ్కు కేటీఆర్ ఫోన్, జనసేనాని థ్యాంక్స్, కారణం ఇదీ!
అమరావతి/హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖమంత్రి (ఆపద్ధర్మ) కల్వకుంట్ల తారక రామారావు బుధవారం ఫోన్ చేశారని తెలుస్తోంది. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీ పైన జనసేన నిర్వహించిన కవాతు విజయవంతం కావడంపై పవన్కు కేటీఆర్ అభినందించారు. కేటీఆర్కు పవన్ థ్యాంక్స్ చెప్పారు.
ఆ 10 లక్షలమంది నా కోసం రాలేదు: పవన్ కౌంటర్, జగన్కు చురకలు, ఆ పనులతో చంపొద్దని..
మరోవైపు, కేటీఆర్ తెలంగాణ కాంగ్రెస్ నేతల పైన నిప్పులు చెరిగారు. తాను 2006 నుంచి 2014 వరకు తెలంగాణ కోసం పోరాడానని చెప్పారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వారు ఆ సమయంలో ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. తన గురించి మాట్లాడే ముందు కాంగ్రెస్ నేతలు హద్దుల్లో ఉండాలని హెచ్చరించారు. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ అని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
నేను నమ్మింది నిజమైంది
కాగా, పవన్ కళ్యాణ్ రెండు రోజుల క్రితం ధవళేశ్వరం బ్యారేజీ పైన కవాతు నిర్వహించిన విషయం తెలిసిందే. అనంతరం మరుసటి రోజు జనసేన కవాతుపై ఆ పార్టీ ప్రెస్ నోట్ విడుదల చేసింది. మనకు కావలసింది అధికారం కాదని, మార్పు అని, అది రావాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతతో ఉండాలని, బాధ్యతతో కూడిన యంత్రాంగం కావాలని, ఇంత అస్తవ్యస్తమైన వ్యవస్థని ఊరట కలిగించడానికే తన వంతుగా పార్టీ పెట్టానని, పార్టీ పెట్టినప్పుడు ఐదుగురు కూడా లేరని, కానీ నా వెంట అందరూ వస్తారని విశ్వసించానని, అది నిజమైందన్నారు.
కవాతుకు వచ్చిన జనాన్ని చూసి ఖిన్నుడినయ్యా
నాకు భగవంతుని ఆశీస్సులున్నాయని, కవాతుకు లక్షలాదిగా జనం వస్తుంటే చూసి ఖిన్నుడనైపోయానని, తూర్పు గోదావరి జిల్లాకు జనసేన ద్వారా చేయాల్సింది చేద్దామని, శ్రీకాకుళంలో తుపాను బాధితులను పరామర్శ అనంతరం తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారు. కవాతుకు తరలి వచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు అన్నారు.
పవన్ను కలిసిన పలువురు నేతలు
ఇదిలా ఉండగా, రాజమహేంద్రవరం షెల్టన్ హోటల్లో పలువురు నేతలు పవన్ కళ్యాణ్ను కలిశారు. మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, మాజీ ఎమ్మెల్యేలు పంతం మోహన్గాంధీ, రాపాక వరప్రసాద్, పాముల రాజేశ్వరి, పార్టీ నేతలు గురుదత్త ప్రసాద్, పంతం నానాజీ, అత్తి సత్యనారాయణ, కృష్ణారావు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు కలిశారు.
పవన్ కళ్యాణ్ను చూసేందుకు తరలి వచ్చిన అభిమానులు
మంగళవారం కూడా సాయంత్రం ఆయన విశాఖపట్నం వెళ్లేందుకు బయటకు వచ్చినప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు నినాదాలు చేయడంతో ఆయన కారు పైకి వచ్చి అందరికీ అభివాదం చేశారు. షెల్టన్ హోటల్ నుంచి కర్రి సూర్యానారాయణ రెడ్డి పెట్రోల్ బంక్ వరకు రోడ్ షోలా నిర్వహించారు. కాగా, ఆయన బుధవారం శ్రీకాకుళం టిట్లీ తుఫాను బాధితులను పరామర్శించారు.