నంద్యాలలో రిపీట్: కేటీఆర్ ‘కథ’ వైయస్ జగన్ నోట!
హైదరాబాద్/కర్నూలు: గురువారం నంద్యాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ కథ చెబుతారు. రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలను నిశితంగా పరిశీలించే వారికి ఈ కథ ఎక్కడో? ఎప్పుడో విన్నట్టే అనిపిస్తుంది.
ఊపిరున్నంత వరకూ జగన్తోనే: అఖిలప్రియ, బాబుపై శిల్పా తీవ్ర వ్యాఖ్యలు
అది నిజమే.. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఆ కథను తెలంగాణ మంత్రి కేటీ రామారావు గతంలో చాలాసార్లు ఉపయోగించారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి విమర్శిస్తున్న దాదాపు ప్రతి సమయంలోనూ కేటీఆర్ ఈ కథను చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారాల్లోనూ ఆయన ఈ కథనం వినిపించారు.
ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పుడు ఉప ఎన్నికల నేపథ్యంలో నంద్యాలలో నిర్వహించిన సభలో వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కథనం వినిపించడం గమనార్హం.
ఆ కథ విషయానికొస్తే.. 'ఒక ఊరిలో పలు రకాల వ్యవసనాలకు బానిసైన 17ఏళ్ల కుర్రాడు.. తాగిన మత్తులో ఇంట్లో దొంగతనం చేస్తుండగా.. తల్లి చూసింది. ఇది తప్పని చెప్పబోయిన ఆమెను రోకలిబండతో కొట్టి చంపాడు. దాన్ని చూసిన తండ్రి ప్రశ్నించగా.. ఆయనను కూడా కొట్టి చంపాడు. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి అతను చేసిన నేరాలు విని ఆశ్చర్యపోతూ 'సొంత తల్లిదండ్రులనే చంపిన నీకు ఏ శిక్ష విధించాలో చెప్పమ'ని అడిగారు. దీంతో అతడు విలపిస్తూ.. తల్లిదండ్రులు లేని పిల్లవాడినని, తనను విడిచిపెట్టాలని అడిగాడట. ఇప్పుడు టీడీపీ, చంద్రబాబు వైఖరి కూడా అలాగే ఉంది' అని జగన్ అన్నారు.