టీడీపీలోకి వైయస్కు అత్యంత ఆప్తులు!: రాయపాటి చర్చల ఫలితం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, దివంగత సీఎం వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తులుగా పేరున్న
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, దివంగత సీఎం వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఆప్తులుగా పేరున్న కూచిపూడి సాంబశివరావు, విజయ దంపతులు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
Recommended Video
మంత్రి, ఎంపీ చర్చలు..
ఇప్పటికే ఏపీ మంత్రి నక్కా ఆనందబాబు, ఎంపీ రాయపాటి సాంబశివరావులు వీరిద్దరితో చర్చలు జరుపుతూ టీడీపీలో చేరేందుకు ఒప్పించారని సమాచారం. ఈ నేపథ్యంలోనే సాంబశివరావు, విజయ దంపతులు.. చంద్రబాబు సమక్షంలో త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
వైయస్ ముఖ్య అనుచరుడిగా కూచిపూడి..
అయితే, గతంలో కూచిపూడి దంపతులు గుంటూరులో స్థిరనివాసం ఏర్పాటుచేసుకొని జిల్లా కాంగ్రెస్ కమిటీలోనూ, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోనూ పలు కీలక పదవులు నిర్వర్తించారు. అప్పట్లో వైయస్ రాజశేఖరరెడ్డికి ముఖ్య అనుచరుడిగా పేరొందిన సాంబశివరావు ఆయన నిర్వహించిన పాదయాత్రలో కూడా చివరివరకు పాల్గొని మరింత చేరువయ్యారు.
అభిమానం చాటుకున్న వైయస్
ఆ కారణంగానే వైయస్ రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే సాంబశివరావుకు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. అంతే కాకుండా ఆయన సతీమణీ విజయకు స్యయంగా రాజశేఖరరెడ్డే ఫోన్చేసి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవికి ఆమెను ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు. నాగార్జున వర్శిటీలో బోటనీ ప్రొఫెసర్గా ఉన్న విజయ.. వైయస్ పిలుపుతోనే రాజకీయాల్లోకి వచ్చారు.
జగన్తో వెళతారనుకున్నా..
అయితే, వైయస్ మరణానంతరం ఈ దంపతులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరతారని భావించారు. అయితే వారు ఆ నిర్ణయాన్ని తీసుకోలేదు. గత కొంత కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఈ దంపతులను టీడీపీలో చేర్చుకుంటే.. దుగ్గిరాల ప్రాంతంలో పార్టీ మరింత బలపడుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో వారితో మంతనాలు జరిపిన మంత్రి ఆనంద్ బాబు, ఎంపీ రాయపాటిలు, టీడీపీలో చేర్చేందుకు సిద్ధం చేసినట్లు సమాచారం.