ఆంధ్రా బిత్తిరి సత్తి: కొవ్వెక్కి మాట్లాడుతున్నారు: స్పీకర్..సీఎం..బొత్సాపై కూన రవి వ్యాఖ్యలు..!
టీడీపీ నేత..మాజీ విప్ కూన రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. స్పీకర్ తమ్మినేని సీతారం..ముఖ్యమంత్రి జగన్..మంత్రి బొత్సా పైన ఈ వ్యాఖ్యలు చేసారు. ముఖ్యమంత్రి జగన్ మూడు తలల రావణాసు రడంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి తాజాగా శాసనసభలో మూడు రాజధానుల గురించి చేసిన వ్యాఖ్యల మీద కూన రవి స్పందించారు. మూడు రాజధానులు పెడితే అభివృద్ధి జరిగిపోదన్నారు. సీఎంతో పాటుగా స్పీకర్ తమ్మినేని..మంత్రి బొత్సా మీద అదే రకంగా మాట్లాడారు. జీఎన్ రావు అసమర్ద అధికారి..ఆ కమిటీకి ఉన్న అర్హత ఏంటి అని ప్రశ్నించారు.
ఆంధ్రా బిత్తిరి సత్తి బొత్సా అంటూ..ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అరిష్టమని కూన రవి వ్యాఖ్యానించారు. అదే విధంగా స్పీకర్ మీద మరోసారి పరుషంగా వ్యాఖ్యలు చేసారు. తమ్మినేని సీతారాం ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నాడు. అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ప్రజలను మోసం చేయాలని చూస్తే గుడ్డలు ఊడతీసి కొడతాం అంటూ వ్యాఖ్యానించారు.
తమకు పరిపాలన వికేంద్రీకరణ కాదని.. ఆర్దిక.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలన్నారు. ఉత్తరాంధ్ర అంటే విశాఖపట్నం మాత్రమే కాదని.. సెక్రటేరియట్ భవనాలు శ్రీకాకుళం-ఆముదాలవలస మధ్యలో కట్టండంటూ డిమాండ్ చేసారు.
కొద్ది రోజుల క్రితం స్పీకర్ .. ముఖ్యమంత్రి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా కూన రవి కుమార్ మీద పోలీసు కేసు నమోదైంది. కొద్ది రోజులు కనిపంచకుండా ఉన్న కూన రవి కుమార్ ఆ తరువాత ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఇక, ఇప్పుడు తిరిగి అదే విధంగా స్పీకర్ తో పాటుగా ముఖ్యమంత్రి మీద..మంత్రి బొత్సా మీద కూన రవి ఈ వ్యాఖ్యలు చేసారు. ఇక, ఇప్పుడు రవి కుమార్ చేసిన ఈ రకమైన వ్యాఖ్యల మీద వైసీపీ నేతలు..ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందో చూడాలి.