ముగింపు లేదా?: భయం భయంగానే చంద్రబాబు సొంత నియోజకవర్గం
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సొంత నియోజకవర్గంలోని ప్రజలు ప్రతీ రోజూ భయాందోళనలతో కాలం గడపుతున్నారు. ఎందుకంటే వారికి ఏనుగుల బెడద మితిమీరిపోయింది. కొన్ని ఊళ్లలో కోతులు ఎలా ఇబ్బందులకు గురిచేస్తున్నాయో.. ఈ నియోజకవర్గం ప్రజలను ఏనుగులు అంతకంటే వందరెట్లు ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
అంతేగాక, ఇక్కడ ప్రజలను భయకంపితులను చేస్తున్నాయి. పదుల సంఖ్యలో వచ్చే ఏనుగుల మందలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాటిని ఎదుర్కొనేందుకు కూడా ధైర్యం చేయలేకపోతున్నారు. గతంలో ఏనుగుల బారిన పడి తమ ప్రాణాలు సైతం ఈ నియోజకవర్గంలో కోల్పోయారు.
ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, అటవీశాఖ అధికారులు కూడా ఏనుగుల అడ్డుకోలేకపోతుండటంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సొంత జిల్లా, సొంత నియోజక వర్గంలో ఏళ్ల తరబడి నిర్విరామంగా స్వైర విహారం చేస్తున్నా గజరాజుల గురించి ప్రభుత్వం పట్టించుకోక పోవడం గమనార్హం.
అడవుల్లో ఉండాల్సిన ఏనుగులు గ్రామాల్లోకి తరచూ వస్తుండటంతో పలువురు బాధితులు ఊరు విడిచి వెళ్లేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఏనుగుల బీభత్సానికి అటవీ అధికారులు చేపట్టిన ఒక్క చర్య కూడా సత్ఫలితాలు ఇవ్వలేదని వాపోతున్నారు. ఈ ఏడాదిలో సుమారు రూ. 20 కోట్లకు పైగా పంట నష్టం వాటిల్లిందని సమాచారం.
పంటలు పోయినా పర్లేదు మనుషులను మిగిలిస్తే చాలు అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని కుప్పం నియోజరవర్గ ప్రజలు చెబుతున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలోని గుడిపల్లి, కుప్పం, శాంతిపురం, రామకుప్పం మండలాల్లోనే కాకుండా పలమనేరు నియోజకర్గంలోని బి.కోట, బైరెడ్డి పల్లెల్లో ఏనుగుల దాడులు నిత్యం కృత్యం అవుతున్నాయి.
పంట నష్టం గురించి అధికారులు రిపోర్టు రాసుకెళుతున్నారే తప్ప ఇంత వరకు తమకు పైసా కూడా పరిహారం అందలేదని కుప్పం ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏనుగులను గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు నియోజకవర్గం ప్రజలు వేడుకుంటున్నారు.