Sugali Preethi కేసును సీబీఐకి అప్పగిస్తూ ఉత్తర్వులను జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన సుగాలి ప్రీతి మరణించిన సంఘటనపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్ ఉత్తర్వులను జారీ చేశారు. కర్నూలు జిల్లాల్లో మూడేళ్ల కిందట సంచలనం సృష్టించిన రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని సుగాలి ప్రీతి అనుమానాస్పదంగా మరణించిన ఘటనపై విచారణను సీబీఐకి అప్పగించాలంటూ ఇదివరకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను నిర్వహించారు.
హైకోర్టు తప్పు పట్టినా నో కాంప్రమైజ్: ప్రభుత్వ భూముల అమ్మకాలపై ముందుకే: గడువు పెంపు
కర్నూలు సభలోనే నిర్ణయం..
ఇదివరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో బహిరంగ సభను నిర్వహించిన సమయంలో సుగాలి ప్రీతి తల్లిదండ్రులు ఆయనను కలిశారు. అప్పట్లోనే ఈ కేసును సీబీఐకి అప్పగించేలా ఏర్పాట్లను చేయాలని సుగాలి ప్రీతి తల్లిదండ్రుల సమక్షంలోనే వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. దీనికి అనుగుణంగా తాజా ఉత్తర్వులు వెలువడ్డాయి. రెండు లేదా మూడు వారాల్లో సీబీఐ అధికారులు తమ దర్యాప్తును ఆరంభించవచ్చని తెలుస్తోంది. మూడు నెలల కాలంలో సీబీఐకి అప్పగించిన మూడో కేసు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
రాష్ట్రంలో సీబీఐ కేసుల పరంపర
ఇదివరకు దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. మార్చి 11వ తేదీన హైకోర్టు దీనికి సంబంధించిన ఆదేశాలను జారీ చేసింది. ఇటీవలే విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ వ్యవహారాన్ని కూడా హైకోర్టుకు సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన ఉత్వర్వులు ఇంకా వెలువడాల్సి ఉంది. అదే సమయంలో సుగాలి ప్రీతి హత్యకేసును కూడా సీబీఐకి అప్పగించడానికి అవసరమైన ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది.
అనుమానాస్పద స్థితిలో సుగాలి ప్రీతి మృతి
2017లో సుగాలి ప్రీతి మరణించిన విషయం తెలిసిందే. కర్నూలు లక్ష్మీగార్డెన్స్ ప్రాంతంలో ఉంటున్న రాజు నాయక్, పార్వతి దంపతుల కుమార్తె ఆమె. దిన్నెదేవరపాడు సమీపంలోని కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థిని. ఈ రెసిడెన్షియల్ పాఠశాాల తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడిదనే ఆరోపణలు ఉన్నాయి. 2017 ఆగస్టు 19వ తేదీన సుగాలి ప్రీతి ఫ్యాన్కు ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో.. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని చెబుతున్నారు. అత్యాచారం చేసి, హతమార్చి ఉంటారని ఆరోపిస్తున్నారు.
Recommended Video
టీడీపీ హయాంలో చోటు చేసుకున్నా..
ఇదివరకే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ సుగాలి ప్రీతి కుటుంబీకులు డిమాండ్ చేసినప్పటికీ.. అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం స్పందించలేదు. పాఠశాల తమ పార్టీకి చెందిన నాయకుడిదే కావడం వల్ల చంద్రబాబు ప్రభుత్వం పూర్తిస్థాయి దర్యాప్తునకు అంగీకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. సుగాలి ప్రీతి కుటుంబానికి అండగా.. తాజాగా ప్రభుత్వం మారిన నేపథ్యంలో మరోసారి అదే డిమాండ్ లేవనెత్తుతున్నారు సుగాలి ప్రీతి కుటుంబీకులు. ఆ కుటుంబానికి పవన్ కల్యాణ్ అండగా నిల్చున్నారు. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో భారీ ర్యాలీని నిర్వహించారు.